పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి
గద్వాలటౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల గడువు సమీపిస్తుందని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అడిషినల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం స్థానిక బాలభవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహా పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ – మార్గ నిర్ధేశక తరగతులు కార్యక్రమానికి అడిషినల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి పదికి పది మార్కులు సాధించాలని సూచించారు. వసతిగృహాల్లో చదివే విద్యార్థులందరూ నిరుపేద కుటుంబాల పిల్లలే ఉంటారని, వీరికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ప్రముఖ సైకాలజిస్టు రవీంద్రధీర మాట్లాడు తూ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలనే దా నిపై అవగాహన కల్పించారు. సొంతంగా ఆలోచించడం, నిరంతర సాధన చేయడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ విజయలక్ష్మి, సంక్షేమశాఖల జిల్లా అధికారు లు నుషిత, అక్బర్బాషా తదితరులు పాల్గొన్నారు.


