
‘నెట్టెంపాడు’ పెండింగ్ పనులు పూర్తిచేయాలి
సీజనల్ వ్యాధులు
ప్రబలకుండా జాగ్రత్తలు
ఎర్రవల్లి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని కోండేర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణ కొరకు గ్రామాల్లో నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో దోమలు పెరగకుండా కిరోసిన్ చల్లడం, దోమల మందు కొట్టడం, బ్లీచింగ్ పౌడర్, ఆయిల్ బాల్స్ వేయడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గతంలో అధిక కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే గర్భిణులను సురక్షితంగా జిల్లా ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రజలు కాచిన వేడి నీటిని తాగడంతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్ధాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు, జిల్లా వైద్యాధికారి సిద్దప్ప, హౌసింగ్ డీఈ శ్రీనివాసులు, ఏఈ ప్రియాంక, ఎంపీడీఓ అజార్ మొహియుద్దీన్ పాల్గొన్నారు.
గద్వాల: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ, నిలిచిన సివిల్వర్క్సను పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షించారు. నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కుడికాలువ పరిధిలో భూసేకరణ ప్రక్రియ చేయకపోవడంతో పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 99బీ, 100 ప్యాకేజీల కింద చేయాల్సిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఆయా రైతులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి భూసేకరణను పూర్తి చేయాలన్నారు. సేకరణ అనంతరం అక్కడ చేపట్టాల్సిన సివిల్వర్క్స్ పనులు వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, ఎస్డీసీ శ్రీనివాస్రావు, ఇరిగేషన్శాఖ డీఈ, ఏఈలు, తహసీల్దార్ మల్లిఖార్జున్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
మాతృమరణాలు ఆపడమే లక్ష్యం..
ప్రభుత్వ ఆసుపత్రులలో మాతృమరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యసేవలు అందించాలని.. వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు కలిసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోస్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్పతో కలిసి గట్టు, ఇటిక్యాల పీహెచ్సీల వైద్యులు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్సను మాత్రమే అందించాలన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదని ఒకవేళ ఇస్తే అలాంటి ఆర్ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయిజ మండలం బింగిదొడ్డి గ్రామంలో బాలింతకు ఆర్ఎంపీ డాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా ఇంజక్షన్ చేయడంతో బాలింత మృతిచెందడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసూనరాణి, డాక్టర్లు రమేష్, రాధిక, ఆరోగ్యశాఖ వైద్యసిబ్బంది తిరుమలేష్రెడ్డి, ఏఎస్వో నర్సయ్య హెల్త్అసిస్టెంట్లు, సూపర్వైజర్లు, ఆరోగ్యకార్యకర్తలు పాల్గొన్నారు.