
వైద్యం కోసం నిరీక్షణ
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమయపాలన పాటించని వైద్యులు
కలెక్టర్ హెచ్చరించినా..
రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, అత్యవసర కేసులకు సంబంధించి వైద్యాన్ని సైతం అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలోనే గురువారం కలెక్టర్ బీఎం సంతోష్ వైద్యారోగ్యశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా సమయపాలన పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అయితే హెచ్చరికలు జారీ చేసి 24గంటలు గడవకముందే కలెక్టర్ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తమకు అలవాటైన సమయంలో విధులకు హాజరు కావడం కొసమెరుపు.
ప్రసవాలు, డయాలసిస్ సేవలు మెరుగు
ఇదిలాఉండగా, జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు సంబంధించి రాష్ట్రంలోనే ఉత్తమ సేవలు అందిస్తున్నారు. 2024 ఏప్రిల్–2025 మార్చి వరకు 10 పీహెచ్సీలలో 2,540 సాధారణ ప్రసవాలు, జిల్లా ఆస్పత్రి, అలంపూర్, అలంపూర్ చౌరస్తాలోని ఆస్పత్రుల్లో 3,688 సాధారణ ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు ఉత్తమ సేవలందించడంతో రాష్ట్రంలోనే మూడో స్థానం సాధించారు.
చిత్రంలో ఖాళీ కుర్చీ కనిపిస్తున్నది జిల్లా ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ గది. ఉదయం 9 గంటలకు హాజరుకావాల్సిన అధికారి 9.48 గంటల వరకు హాజరుకాలేదు. జిల్లా ఆస్పత్రి వైద్యులు సైతం కొందరు 9.30 తర్వాత మరికొందరు 10 గంటల తర్వాత తీరిగ్గా రావడం కనిపించింది. ఆస్పత్రిలోని పరిసరాలు సైతం అపరిశుభ్రంగా దర్శనమిచ్చాయి. 150 పడకల సామర్థ్యం గల ఈ ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచి పలువురు వైద్యం కోసం వచ్చారు. వైద్యులు సమయానికి రాకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పలేదు. ఇదిలాఉండగా, గతంలో వైద్యవిధానపరిషత్ కింద ఉన్న జిల్లా ఆస్పత్రి.. ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాల వచ్చి మరింత మెరుగైన వసతులు కల్పించినప్పటికీ వైద్యులు, వైద్యసిబ్బంది తీరులో మాత్రం మార్పు రాలేదు. పాత ఆనవాయితీనే ఒంట పట్టించుకుని ఆలస్యంగా విధులు హాజరుకావడం కనిపించింది.
రోగుల ఇబ్బందులు
వైద్యం అందించాల్సిన వైద్యులు సమయపాలన పాటించకపోవడంవో వివిధ రకాల రోగాలతో వైద్యం కోసం వచ్చిన రోగులు ఆసుపత్రి ఆవరణలలో నిరీక్షిస్తూ కనిపించారు. ప్రధానంగా 24గంటల పాటు వైద్యసేవలు అందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన అయిజ, గట్టు, వడ్డేపల్లి, మానవపాడు, క్యాతూరు, ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది 10గంటలకు విధులకు హాజరు కావడం కనిపించింది. దీంతో ఆయా ఆసుపత్రులలో వైద్యం కోసం వచ్చిన రోగులు వైద్యుల కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. జిల్లా ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
గద్వాల/సాక్షి నెట్వర్క్: ‘వైద్యో నారాయణ హరి’.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. కానీ, కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యుల నిర్వాకం వల్ల ఈ అర్థాన్నే పూర్తిగా మార్చేశారు. ఆలస్యంగా విధులకు హాజరుకావడం.. కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతరు చేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వాలు వైద్యశాఖలో పలు సంస్కరణలు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు రోగులకు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు చేపడుతున్నా.. అమలు చేయాల్సిన వైద్యులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎన్నో ఇబ్బందుల నడుమ వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పతిలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉదయం 10 గంటల తర్వాతే విధులు హాజరుకావడం గమనార్హం. చాలా చోట్ల అత్యవసర వైద్యం కోసం జిల్లా కేంద్రం, అక్కడ కాకపోతే కర్నూల్, హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి దాపురించింది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆస్పత్రిని ‘సాక్షి’ విజిట్ చేసినపుడు పలు విషయాలు వెలుగు చూశాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు..
10 పీహెచ్సీలు, రెండు టీవీవీపీ, ఒక జీజీహెచ్..
జిల్లా వ్యాప్తంగా ప్రజలకు వైద్యం అందించేందుకు మొత్తం 10 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలున్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా ఆస్పత్రి, అలంపూర్, అలంపూర్చౌరస్తాలో ప్రభుత్వ వైద్యవిధానపరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం జనాభా సుమారు 6లక్షల వరకు ఉండగా, అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతిరోజు వెయ్యికి పైగా వివిధ రోగాలకు సంబంధించి వైద్యం కోసం అవుట్ పేషంట్లుగా వెళ్తుంటారు. ఇందులో సుమారు 200మందికి పైగా ఇన్పేషంట్లు చేరుతుంటారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు సుమారు 800మంది అవుట్పేషంట్లు వస్తుండగా.. 150మంది వరకు ఇన్పేషంట్లుగా చేరుతుంటారు.
చిత్రంలో కనిపిస్తున్నది అయిజ పీహెచ్సీ. ఉదయం 10.30 గంటలు అయినా కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు (డాక్టర్లు), ఫార్మసిస్టు విధులకు హాజరుకాలేదు. అయిజ మండలంతోపాటు గట్టు, మల్దకల్, వడ్డేపల్లి మండలాల నుంచి అధికంగా గర్భిణులు వైద్యం కోసం వచ్చారు. అలాగే, కుక్కకాటు వ్యాక్సిన్ నిమిత్తం మరో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. కానీ, 9 గంటలకు విధులు హాజరుకావాల్సిన వైద్యులు గంటన్నర ఆలస్యమైనా రాకపోవడంతో అటు గర్భిణులు, ఇటు ఇతర రోగులకు ఎదురుచూపులు తప్పలేదు. వైద్యులు సమయపాలన పాటించి మెరుగైన వైద్యం అందిస్తే బాగుంటుందని అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులు పేర్కొన్నారు.
10 గంటల తర్వాతే విధులకు హాజరు
రోగులకు తప్పని పడిగాపులు
జిల్లా ఆస్పత్రిలోనూ అదేతీరు
కలెక్టర్ హెచ్చరికలు సైతం బేఖాతరు
‘సాక్షి’ విజిట్లో వెలుగుచూసిన వైనం
సమయపాలన పాటించకుంటే చర్యలు
వైద్యులు సమయపాలన పాటించకపోతే వారిపై తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప తెలిపారు. అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర మాట్లాడుతూ గతంలో పేషంట్లు ఉదయం 10గంటలకు ఓపీకి వస్తుండడంతో వైద్యులు కూడా అదే సమయంలో రావడం అలవాటైందని, ఇక మీదట ఉదయం 9గంటలకు ఖచ్చితంగా విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వైద్యం కోసం నిరీక్షణ

వైద్యం కోసం నిరీక్షణ

వైద్యం కోసం నిరీక్షణ

వైద్యం కోసం నిరీక్షణ

వైద్యం కోసం నిరీక్షణ