
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
గద్వాల: రాజోళి మండలం పెద్ద ధన్వాడలో ప్రాణాంతకమైన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుచేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని వివిధ రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సాగు భూములను బలవంతంగా లాక్కొని రైతులను రోడ్డుపాలు చేయడమే కాకుండా, భవిష్యత్ తరాలను సైతం ప్రమాదంలో నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నదులు, సాగుభూములను నాశనం చేసే పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ముందుకెళ్లడం దారుణమని మండిపడ్డారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును ప్రజలు, రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారని.. తమను తాము కాపాడుకునే క్రమంలో జరిగిన ఆందోళనలో అమాయకులపై పోలీసు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని అన్నారు. దీనిపై ప్రభుత్వం పట్టుదలకు వెళ్లకుండా ప్రజల కోరికను పరిగణనలోకి తీసుకుని పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బాధిత గ్రామస్తులను పరామర్శించే ప్రయత్నం చేస్తున్న నాయకులను ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే చలో పెద్ద ధన్వాడ కార్యక్రమానికి పిలుపునివ్వాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, ఇక్బాల్పాషా, సుభాన్, రంగన్న, రాజ్కుమార్, మోషన్న ఉన్నారు.