మల్దకల్ ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహాహోమం, స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయచైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బీచుపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికాస తరంగిణి, విశ్వ హిందూపరిషత్, ధర్మప్రసార సమితి ఆధ్వర్యంలో చిన జీయర్ స్వామి శిష్య బృందం సభ్యులు ఆలయంలో 41 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం హనుమంతుని గొప్పతనం, ధైర్య సాహసాలను గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు, అర్చకులు, హిందూ సంఘాల సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
మల్దకల్: అంగన్వాడీ టీచర్లు తమ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా సంక్షేమ అధికారిణి సునంద హెచ్చరించారు. బుధవారం మండలంలోని తాటికుంటలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించగా..ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలో బడిబయట ఉన్న పిల్లలందరి గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. బాల్యవివాహాలు చేయడం వలన కలిగే అనర్థాలతో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను తల్లిదండ్రులకు వివరించారు.
అంగన్వాడీ కేంద్రాలను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పౌష్టికాహారంలో పంపిణీలో నిర్లక్ష్యం వహించరాదని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో నెలనెలా గర్భిణీ, బాలింతలు వైద్యపరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. నాగరాణి, మంజుల, లక్ష్మినారాయణమ్మ, అనంతమ్మ, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం