
మోగిన బడిగంట..!
గద్వాలటౌన్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. ఇన్ని రోజులు ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడి గంట కొట్టగానే పాఠశాలలకు చేరుకున్నారు. పాఠశాలన్నీ పండగ వాతావరణంలో ప్రారంభించారు. కొన్ని పాఠశాలలకు మామిడి తోరణాలను కట్టి అలంకరించారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికారు. హాజరైన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేశారు.
తొలిరోజు.. తడ‘బడి’
ఎంతో ఉత్సాహంగా ప్రారంభం కావాల్సిన కొత్త విద్యా సంవత్సరం తడబడుతూ మొదలైంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. అయితే చాలా పాఠశాలలు ఉపాధ్యాయుల హజరుకే పరిమితం అయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగా ఉండటం గమనార్హం. పట్టణాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం చాలా తక్కువగానే ఉంది.
● మానవపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, 12 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.
● గోకులపాడు పాఠశాలలో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు హాజరయ్యాడు. విద్యార్థులు ఒక్కరూ కూడా పాఠశాలకు రాలేదు. అలాగే, కేజీబీవీకి ఆరుగురు ఉపాధ్యాయులు హాజరుకాగా.. విద్యార్థులు ఎవరూ ప్రార్థన సమయం నాటికి హాజరుకాలేదు.
ఏరువాక పౌర్ణమి పండగ కావడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో తొలిరోజు విద్యా సంస్థలు వెలవెలబోయాయి. వచ్చిన కొద్దిమంది విద్యార్థులకు అసౌకర్యాలు దర్శమిచ్చాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బడికి పంపే విషయంలో మరో రెండు రోజులపాటు వేచిచూద్దామన్న ధోరణిలో మరికొంత మంది తల్లిదండ్రులు ఉన్నారు. వచ్చిన విద్యార్థులకు మాత్రం ఉపాధ్యాయులు.. మధ్యాహ్న భోజనం పెట్టించి తరువాత పంపించారు. దూరప్రాంత విద్యార్థులు పాఠశాలలకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. బస్సు సౌకర్యాలు ఎక్కడ కనిపించలేదు. ముఖ్యంగా వసతి గృహాలు మూసివేత ప్రభావం పాఠశాలల హాజరు శాతంపై స్పష్టంగా కనిపించింది. కొన్ని తరగతులలో మాత్రం ఒకరి, ఇద్దరూ మాత్రమే హాజరుకావడం కనిపించింది. తెరిచిన కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలలో సైతం పలుచుగానే హాజరు నమోదైంది. నెలన్నర పాటు వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు మొదటిరోజు పాఠశాలకు వెళ్లడానికి మారాం చేశారు.
ఆసక్తి చూపని వైనం
మొదటి రోజు హాజరు అంతంతే

మోగిన బడిగంట..!

మోగిన బడిగంట..!

మోగిన బడిగంట..!