
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం
గద్వాల: బాల కార్మిక వ్యవస్ధను పూర్తిగా నిర్మూలించి జిల్లాను బాల కార్మిక రహిత ప్రాంతంగా మార్చే దిశగా పని చేయాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని ప్రపంచ బాల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల కారికార్మిక నిర్మూలన జిల్లా కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలకు ఉజ్వల భవిష్యత్ కల్పించడం మన అందరి బాధ్యత అని తెలిపారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా బాలలు కార్మికులుగా మారుతున్నారని, అటువంటి వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, డీసీపీఓ నర్సింహులు, తదితరులు ఉన్నారు.
భూ సమస్యల పరిష్కారానికి సదస్సులు
ధరూరు: భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం మండలంలోని చింతరేవులలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. భూ రికార్డులలో తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దులు నిర్ధారణ, పార్ట్ బీలో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులపై దరఖాస్తులు స్వీకరించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో భాగంగానే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 14వ తేదీ లోపు భూ భారతి కింద వచ్చిన అన్ని దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరేందర్, రెవన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.