నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Jun 13 2025 3:19 PM | Updated on Jun 13 2025 3:19 PM

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

అయిజ: మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఔషధ నియంత్రణ అధికారి వినయ్‌ కుమార్‌ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని వివిధ మెడికల్‌ షాపులను, మెడికల్‌ ఏజెన్సీలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్‌ దుకాణాల్లో కాలం చెల్లిన మందులు విక్రమిస్తే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. ముఖ్యంగా మెడికల్‌ షాపుల్లో ఫార్మసిస్ట్‌ ఉండాలని, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు విక్రయించరాదని, ఎమ్మార్పీ ధరలకు మించి కొనుగోలుదారుల నుంచి డబ్బు తీసుకోరాదని అన్నారు. మందుల కొనుగోలు విక్రయానికి సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించాలని అన్నారు.

రాజోళి ఎస్‌ఐ వీఆర్‌కు అటాచ్‌

గద్వాల క్రైం: బాధితుల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన క్రమంలో రాజోళి ఎస్‌ఐను గురువారం వీఆర్‌కు అటాచ్‌ చేస్తూ ఎస్పీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. రాజోళి మండలం పెద్ద ధన్వాడకి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బాధితులు తమ వ్యవసాయ పొలం, మరొకరి మధ్య ఉన్న భూ వివాదంపై రాజోళి ఎస్‌ఐ జగదీష్‌కు ఫిర్యాదు చేసినా.. నిర్లక్ష్యం కనబర్చినట్లు ఈ నెల 10వ తేదీన ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఎస్‌ఐని జిల్లా కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. అయితే ఇటీవల పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో జరిగిన పలు తప్పిదాలు సైతం ఉండడంతో ఎస్‌ఐపై శాఖాపరమైన చర్యలు చేపట్టినట్లు పలు సామాజిక మాద్యమాల్లో పోస్టులు వైరల్‌ అయ్యాయి.

నేడు రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి రాక

గద్వాల: రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి ఈనెల 13వ తేదీ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30గంటలకు గద్వాల మండలంలోని పుటాన్‌పల్లిలో సాగుచేసిన పత్తి విత్తన పంటలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారన్నారు. అక్కడే రైతులతో ముఖాముఖి అనంతరం 11:30గంటలకు కలెక్టరేట్‌లో పత్తి విత్తన పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించనున్నట్లు తెలిపారు.

విమాన ప్రమాదం దురదృష్టకరం

గద్వాల: గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మాజీ సీఎం విజయ్‌రూపానితో పాటు దేశప్రజలు, విదేశీయులు, చిన్నారులు, మహిళలు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. మృతులకు నివాళి అర్పించడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.

ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీఫలితాలు విడుదల

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ సెమిస్టర్‌– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్‌ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్‌–1లో 37.74 శాతం, సెమిస్టర్‌–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, అడిషనల్‌ కంట్రోలర్‌ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement