
బాధిత మహిళలకు అండగా నిలవాలి
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని భరోసా, సఖీ, షీటీం సెంటర్లను గురువారం ఆకస్మికంగా ఎస్పీ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో లైంగిక దాడులకు గురైన మైనర్ బాలికల కేసులు, నిందితులకు శిక్షపడే విధంగా తీసకున్న చర్యలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. వేధింపులకు గురైన క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం, నమ్మకం, చట్టాలపై కల్పిస్తున్న విషయాలను ఆరా తీశారు. భరోసా సెంటర్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించి మనోధైర్యం కోల్పోయిన బాధితులకు అండగా ఉండాలన్నారు. నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, లాయర్లు, కౌన్సెలింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వం బాధింపబడ్డ బాధితులకు భరోసా ఇవ్వాలనే ధృఢసకల్పంతో ఈ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం సెంటర్లోని వివిధ విషయాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, తదితరులు ఉన్నారు.