
రైతు హక్కులను బలపరిచే.. కొత్త విత్తన చట్టం
గద్వాలటౌన్: రైతులు ఎదుర్కొంటున్న పత్తి విత్తనాల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా, కంపెనీలపై నియంత్రణతో పాటు రైతు హక్కులను బలపరిచే కొత్త విత్తన చట్టం త్వరలో అమలులోకి రానుందని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ సంతోష్ అధ్యక్షతన విత్తన పత్తి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు, సమస్యల పరిష్కారానికి అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులు శ్రమతో సాగుచేస్తున్న పత్తి పంట దేశియంగా మాత్రమే కాకుండా చైనా వంటి దేశాలకు పోటీ ఇవ్వగల స్థాయిలో ఉందని చెప్పారు. నడిగడ్డలో పత్తి రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకోవడానికి వచ్చామన్నారు. రైతు విత్తనాలు ఫెయిల్, అఽధిక వడ్దీ రేట్లు, ఆస్తుల తాకట్టుతో అప్పుల్లో కూరుకుపోతూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి బాధించిందని అన్నారు. జీఓటీ విధానాన్ని సీడ్ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకుని రైతులను మోసం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత చట్టాలలో జీఓటీ విధానమే లేదన్నారు.
సీడ్ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించొద్దు
ములుగు జిల్లాలో మొక్కజొన్న సమస్యపై కమిషన్ స్పందించి ఆదివాసులకు న్యాయం చేశామని, అదే తరహాలో నడిగడ్డలో సీడ్ పత్తి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీడ్ కంపెనీలు చట్టాలను ఉల్లంఘించి ఆర్గనైజర్ వ్యవస్థను ప్రోత్సహించడం తగదని ఆయన అన్నారు. రైతులు పండిస్తేనే సీడ్ కంపెనీలు రూ.కోట్లు ఆర్జిస్తున్నాయని, అలాంటిది సీడ్ కంపెనీలు రైతు నుంచి ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవడం లేదని నిలదీశారు. చట్ట విరుద్ధంగా ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా సీడ్ ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. పత్తి రైతులకు అప్పు ఇచ్చే ఆర్గనైజర్లు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలని కలెక్టర్ పరిశీలించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ కంపెనీల నుంచి స్పష్టమైన డేటాను సేకరించి, ఫెయిల్యూర్ అయిన విత్తనాలపై పూర్తి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మనీ లాండరింగ్ చట్టం, అగ్రిమెంట్లపై స్పష్టత కోసం ఎస్ఓపీ తయారుచేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు, వివిధ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆర్గనైజర్ల తీరుపై ఆగ్రహంవ్యక్తం చేశారు. సమావేశంలో అడిషినల్ కలెక్టర్ లక్ష్మినారాయణ, కమిషన్ సభ్యులు రాములునాయక్, సునీల్కుమార్, రాంరెడ్డి, గోపాల్రెడ్డి, గంగాధర్, నర్సింహారెడ్డి, భవాని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ తదితరులు పాల్గొన్నారు.
వాగ్వాదం.. తోపులాట
రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యుల బృందం గద్వాల మండలం పుటాన్పల్లి సమీపంలో పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటుండగా.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ సీడ్ పత్తి రైతుల సమస్యలను చైర్మన్ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విజయ్కుమార్ వెంట వచ్చిన వారిపై దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులతో సైతం వాగ్వాదం జరిగింది. అనంతరం బలవంతంగా విజయ్కుమార్ను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ధరూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు సీడ్ కంపెనీలకు, ఆర్గనైజర్లకు అమ్ముడుపోయారని విజయ్కుమార్ ఆరోపించారు. ఇదిలాఉండగా, విత్తన పత్తి రైతులపై జరుగుతున్న అక్రమాలపై స్పందించాలని, కంపెనీలు, ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ రంజిత్కుమార్ డిమాండ్ చేశారు. నడిగడ్డలో సీడ్ పత్తి రైతులు పడుతున్న దగాను వివరించారు. అనంతరం కమిషన్ చైర్మన్కు వినతి పత్రం అందజేశారు.
నడిగడ్డ సీడ్ పత్తి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం
సీడ్ కంపెనీలు ఆర్గనైజర్ వ్యవస్థను ప్రోత్సహించడం సరికాదు
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
పంటల పరిశీలనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం

రైతు హక్కులను బలపరిచే.. కొత్త విత్తన చట్టం

రైతు హక్కులను బలపరిచే.. కొత్త విత్తన చట్టం