
పెద్దధన్వాడలో రెవెన్యూ సదస్సు బహిష్కరణ
శాంతినగర్: ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సును గ్రామస్తులు బహిష్కరించారు. రెవెన్యూ సదస్సుకు వచ్చిన రెవెన్యూ అధికారులను వెనక్కు వెళ్లాలని, ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని, రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ కంపెనీ రద్దు చేయకుండా, రైతులపై పెట్టిన కేసులు కొట్టివేసేదాక ప్రభుత్వ పరంగా నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలను గ్రామంలో నిర్వహించబోమని తేల్చిచెప్పారు. అంతేగాక తోటి రైతులు జైలు నుండి ఇంటికి వచ్చేదాకా గ్రామంలో ఎలాంటి పండుగలు జరుపుకోబోమని వెల్లడించారు. అనంతరం తహసీల్దార్ రామ్మోహన్కు వినతిపత్రం అందజేశారు. దీంతో చేసేదిలేక రెవెన్యూ అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెనుదిరిగారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు,
కేసులు ఎత్తివేయాలని డిమాండ్