కృష్ణాతీరంలో చేపల వేట కోసం కూలీల అక్రమ రవాణా
వ్యాపారులకే లబ్ధి..
నిర్బంధ కార్మికులకు విముక్తి కల్పించామని అధికారులు చెబుతున్నప్పటికీ.. పరోక్షంగా వారు చేపల వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తున్నారు. నిర్బంధ కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎక్కడా వ్యాపారులపై కేసులు నమోదు కావడం లేదు. నెలల తరబడి పనులు చేసిన కార్మికులకు వ్యాపారుల నుంచి జీతాలు ఇప్పించడం లేదు. కేవలం రవాణా చార్జీలు ఇచ్చేసి కార్మికులను తమ స్వగ్రామాలకు పంపిస్తున్నారు. అధికారుల ఉదాసీనత కారణంగా ఒక్కో కార్మికుడిపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యాపారికి మిగులుతున్నాయి. ఇదే బాగుందని కొందరు వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే అధికారులకు స్వయంగా ఫోన్లు చేసి కార్మికులను అప్పగిస్తున్నారు. ఇదో రకమైన నయా మోసమని కార్మికులు వాపోతున్నారు.
●
చిన్నంబావి మండలంలోని కృష్ణా నదీ తీరం నుంచి శ్రీశైలం డ్యాం వరకు పదుల సంఖ్యలో అలివి గుడారాలు ఉంటాయి. ఒక్కొక్క గుడారంలో 20 నుంచి 30 మంది వరకు నిర్బంధ కార్మికులు పనిచేస్తుంటారు. ఈ గుడారాలన్నీ నదీతీరంలో అందరికీ కనిపించే దూరంలోనే ఉంటాయి. కానీ అధికారులు మాత్రం అక్కడికి వెళ్లరు. ఎప్పుడైనా తనిఖీలు చేయాల్సి వస్తే.. ముందుగానే వ్యాపారులకు సమాచారం అందుతుంది. అధికారులు వచ్చేలోపు వ్యాపారులు తమ స్థావరాలను మరో చోటికి మార్చడం పరిపాటిగా మారింది.
ఫిర్యాదులు అందినా..
అలివి వలలతో చేపల వేట నిషేధం. కానీ, కృష్ణానదిలో అలివి వేట విచ్చలవిడిగా సాగుతోంది. చేపల వేట కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొస్తారు. వారి సమాచారం ఎక్కడా నమోదు కాదు. కార్మికులు నదిలో పడి చనిపోయినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. కృష్ణాతీరంలోని మల్లేశ్వరం, సోమశిల తదితర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న బాండెడ్ లేబర్ దందాపై ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కార్మికులకు విముక్తి ఇలా..
ఏపీలోని భీమవరం ప్రాంతానికి చెందిన గణేశ్ను నాలుగు నెలల క్రితం ఓ బ్రోకర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మల్లేశ్వరం తీసుకొచ్చాడు. అక్కడ ఓ చేపల వ్యాపారికి అతడిని అప్పగించాడు. అతడి ఫోన్ లాగేసుకున్నారు. గణేశ్ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడంతో అతడి భార్య భీమవరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ సెంటర్(ఎన్ఏఎస్సీ) సభ్యులను కూడా కలిసింది. వారు నాగర్కర్నూల్ జిల్లాలోని తమ సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి నదీతీరంలో వెతకగా.. అక్కడ గణేశ్ కనిపించాడు. అతడితోపాటు మరో 39 మంది నిర్బంధ కార్మికులను స్థానిక పోలీసుల సహకారంతో పెంట్లవెల్లి మండల రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందులో చైన్నె, ఒడిశా, నెల్లూరు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా మల్లేశ్వరం, సంగమేశ్వరం, బోనాసి, మంచాలకట్ట, అమరగరి ప్రాంతాల్లో నిర్బంధంలో ఉన్న కార్మికులు. నాలుగు నెలల క్రితం 28 మంది కార్మికులను కూడా ఇదే తరహాలో అధికారులకు అప్పగించారు. ఇటీవలి కాలంలో మొత్తం 80 మందికి పైగా కార్మికులకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది.
హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు..
ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు. – రాహుల్, బెంగుళూరు
పోలీసులకు ఫిర్యాదు..
కార్మికుల నిర్భందం గురించి రెవన్యూ పరంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నాం. ఇటీవల చాలామంది కార్మికులకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించాం. కార్మికులకు రవాణా చార్జీలు ఇచ్చి వారి స్వగ్రామాలకు పంపిస్తున్నాం. వారి వెంట రెవెన్యూ అధికారులు కూడా వెళ్తున్నారు. కేసుల నమోదు అంశం పోలీసు శాఖ పరిధిలోనిది. దీన్ని కూడా పర్యవేక్షిస్తాం.
– భన్సీలాల్, ఆర్డీఓ, కొల్లాపూర్
చేపల కంపెనీలో ప్యాకింగ్ ఉద్యోగాలని నమ్మిస్తున్న దళారులు
నదీతీరంలో వ్యాపారులకు అప్పగిస్తున్న వైనం
18 గంటల పాటు పనులు.. జీతాలు ఇవ్వకుండా వేధింపులు
ఇటీవల 80 మంది నిర్బంధ కార్మికులకు విముక్తి
నయా వెట్టి..!
నయా వెట్టి..!