
ఒక్క వాన కోసం
అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి, రాజోళి, ఉండవెళ్లి, మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో రైతులు విత్తనాలు వేశారు. కానీ నేటి వరకు సరైన వర్షాలు లేని కారణంగా మొలకెత్తిన విత్తనాలు పండుతాయా, ఎండుతాయా అని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క వాన కురిస్తే వేలాది ఎకరాలకు జీవం వస్తుందని రైతులు అంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం, గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొలకలు ఎండకు వాడిపోతున్నాయని రైతులు అంటున్నారు. మొత్తానికి అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉండటతో రైతుల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఒక వేళ ఈ విత్తనాలు మొలకెత్తకపోతే మొత్తం దున్నేసి మళ్లీ విత్తనాలు వేయాలంటే రెట్టింపు ఖర్చు అవుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. ఒక్క వాన కురిస్తే వేల ఎకరాలకు జీవం వస్తుందని ఈ వారంలో వాన కురుస్తుందని రైతులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.