
మురిపించి.. ముఖం చాటేసి
●
4 ఎకరాల్లో విత్తనాలు వేశాం
గత నెలలో వర్షాలు కురవడంతో ముందస్తుగా నాలుగు ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశాను. ఏదో రకంగా పక్క పొలాల్లో నుండి అడపాదడపా నీరు అందిస్తున్నాం. కానీ వర్షం కురిస్తేనే పొలాలకు నీరు పుష్కలంగా అందుతుంది. దాని వల్ల వేసిన విత్తనం నుండి వచ్చిన మొలక ఎండిపోకుండా, ఆరిపోకుండా ఉంటుంది. ఈ వారంలో వర్షం కురవకపోతే వేల ఎకరాల్లో నష్టం తప్పదు.
– శ్రీకాంత్ రైతు, మాన్దొడ్డి
14 ఎకరాలు కౌలుకు తీసుకున్నా
14 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి విత్తనాలు వేశాను. అప్పటి వర్షాలకు మొలకలు వచ్చాయి. నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో చాలా చోట్ల రైతులకు నీరు అందడం లేదు. వర్షం కురిస్తేనే మొలకలకు జీవం లభిస్తుంది. చాలా చోట్ల విత్తనాలు వేశారు. ముందస్తుగా వేస్తే తర్వాతి పంటకు అనుకూలంగా ఉంటుందనుకుంటే ఆదిలోనే ఇబ్బందులు తప్పడం లేదు.
– వీరస్వామి, రైతు మాన్దొడ్డి
ఎన్నో ఆశలతో వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు
రాజోళి: రైతును ప్రకృతి ఏదో రూపంలో దెబ్బతీస్తూనే ఉంది. ముందస్తుగా వర్షాలు కురవడంతో నాలుగు గింజలు ఎక్కువ పండించుకుందామని ఆశపడితే రైతులకు ఆదిలోనే భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది ఆరంభంలోనే విత్తనాలు వేసుకున్న రైతులకు ప్రకృతి సహకారం కనిపించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షం కురిస్తే తప్పా ప్రస్తుతం ఉన్న తమ పంట బ్రతకదని ఆవేదన చెందుతున్నారు.
15 రోజుల నుంచే విత్తనాలు
గత నెలలో కురిసిన వర్షం, తుఫాను ద్వారా జల్లులకు రైతుల్లో ఆశలు చిగురించి విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. 15 రోజుల కిందట మొదలైన విత్తన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికే వేల ఎకరాల్లో విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. కాని వరణుడు కరుణించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనేందుకు, సేద్యం పనులకు ఇతర కూలీలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు చివరిదాకా ఈ పంట ఉంటుందా, ఉండదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విత్తనమైతే వేశాము కాని, వాటిని కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో పడ్డారు. బోర్లు, బావులు ఉన్న చోట విత్తనాలకు నీరు అందిస్తున్నప్పటికీ, ఆ సౌకర్యం లేని దగ్గర రైతులు వర్షం కోసం పడిగాపులు కాస్తున్నారు. ముందుగానే విత్తనం వేసుకుంటే, అనంతరం వేసే పంటకు సమయం అనుకూలంగా, ప్రకృతి కూడా సహకరిస్తుందని భావించిన రైతులకు ఈ 15 రోజులుగా నిరాశే ఎదురవుతుంది. అయితే ఈ వారంలో వర్షం పడకపోతే పెట్టుబడి మొత్తం గాలిలో కలిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత భూముల్లో విత్తనాలు వేసిన రైతుల పరిస్థితి ఒకలా ఉంటే, కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముందుగానే కౌలు డబ్బులు చెల్లించి, సాగు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇటు కౌలు డబ్బులు చెల్లించి, అటు పెట్టుబడికి ఖర్చు చేసి రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.
15 రోజుల నుంచి కరుణించని వరుణుడు
గాలి, ఎండ తీవ్రతతో వాడుతున్న మొలకలు
దిక్కుతోచని స్థితిలో అన్నదాత

మురిపించి.. ముఖం చాటేసి

మురిపించి.. ముఖం చాటేసి