
బుడి బడి అడుగులు!
గద్వాల టౌన్: బడి.. భవితను తీర్చిదిద్దే చదువులమ్మ ఒడి. జీవిత గమ్యాన్ని నిర్దేశించే దిక్సూచి. నూతన విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెలన్నరగా మూతబడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తరగతి గదులను శుభ్రం చేసి.. పాఠశాల అందంగా అలకరించే పనిలో హెచ్ఎంలు నిమగ్నమయ్యారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రముఖులు, జిల్లా ఉన్నతాఽధికారులు ఎందరో ఉన్నారు. వారు తమ పాఠశాల మధుర స్మృతులను పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ అభిప్రాయాలు వారి మాటల్లోనే...
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించాం. తాగునీరు, టాయిలెట్స్, తరగతి గదుల్లో బెంచీలు వంటి వసతులతో పాటు అన్ని పాఠశాలలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. పాఠశాలలు మొదటిరోజునే విద్యార్థులందరికి యూనిఫామ్లు, నోట్బుక్కులు, పాఠ్యపుస్తకాలు అందించేలా ఇప్పటికే అన్ని రకాలుగా సిద్ధం చేశాం. బడిబాట కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్ విద్యార్థులను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం పోటీపరీక్షలకు అనుగుణంగా విద్యార్థులకు బోధించే విధానంలో నూతన మార్పులు తీసుకొచ్చాం. ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు ఐదురోజుల పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సైతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చేరేలా ఇప్పటికే కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాం. ఈ సారిప పదో తరగతి ఫలితాల్లో గతంతో కంటే పదిశాతం ఉత్తీర్ణత శాతం పెంచగలిగాం. ఇదే ఒరవడితో ముందుకు వెళ్లి మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులకు శిక్షణా ఇవ్వడం జరిగింది. – బీఎం సంతోష్, కలెక్టర్
ఇంట్లో కంటే బడిలో ఉండటమే ఇష్టం
ఫస్ట్ డే స్కూల్ అంటే సంబరంగా వెళ్లేవాళ్లం. వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు ఇంటి వద్ద ఉండటంతో స్నేహితులను మిస్ అయ్యేది. వారిని ఎప్పుడెప్పుడు కలుస్తామా అంటూ ఫస్ట్ డే కోసం ఎదురుచూసే వాడ్ని. ఇంటి కంటే బడిలోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టంగా ఉండేది. నా పాఠశాల విద్యాభ్యాసం అంతా గద్వాలలోనే సాగింది. అప్పట్లో పాఠశాలల్లో సౌకర్యాలు అరకొరగా ఉన్నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్య ప్రాధాన్యతను వివరించేవాళ్లు. పాఠశాల విద్య మొత్తం హుషారుగానే గడిచిపోయింది. బీహార్లో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అప్పుడుప్పుడు గద్వాల పాఠశాల రోజులు గుర్తొస్తాయి. బడీడు పిల్లలందరు బడిలోనే ఉండాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. – రామచంద్రుడు, సీనియర్ ఐఏఎస్ అధికారి, బీహార్
నేటినుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
ప్రభుత్వ బడుల్లో చదివి ఉన్నత స్థాయికి చేరిన వారెందరో..
బడిబాట పట్టిన జ్ఞాపకాన్ని
నెమరవేసుకున్న ప్రముఖులు

బుడి బడి అడుగులు!

బుడి బడి అడుగులు!