
జోగుళాంబ క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్
● ఆలయ నిర్మాణాల పరిరక్షణ,
పునరుద్ధరణకు చర్యలు
● 2028 కృష్ణా పుష్కరాల నాటికి
అభివృద్ధి పనులు పూర్తిచేయడమే లక్ష్యం
● దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్
● ఆయా శాఖల అధికారులతో
సమీక్షా సమావేశం
● రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ సంతోష్ హాజరు
అలంపూర్: జోగుళాంబ క్షేత్రం, ఆలయాల ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా.. ఆధ్యాత్మికతతోపాటు చారిత్రాత్మకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం సమగ్ర మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్నట్లు.. 2028 కృష్ణా పుష్కరాల నాటికి ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అన్నారు. బుధవారం అలంపూర్లో కలెక్టర్ బీఎం సంతోష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, హైలెవల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ మాట్లాడుతూ... ఈ పవిత్ర క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తుందని, ఈ ప్రణాళిక అమలుకు కలెక్టర్ మూడు సార్లు సమీక్షలు నిర్వహించారన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి సమర్పించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 2028లో జరగనున్న కృష్ణా పుష్కరాల నాటికి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆలయాల నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పూర్తి సహకారం అందించనుందని తెలిపారు. మ్యూజియాన్ని ఆధునీకరిండానికి తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి నిధుల కొరత లేదని, పనులు వేగవంతం చేయవచ్చన్నారు. మాస్టర్ ప్లాన్న్లోని పనులకు దాతలు ముందుకు వస్తారన్నారు. అన్నదాన సత్రంను వారం లోపల ప్రారంభించాలని ఈఓ పురేందర్ను అదేశించారు.
పనులు వేగవంతం చేయాలి
రాబోయే పుష్కరాల నాటికి ఈ క్షేత్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని, ఈమేరకు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అజయుడు అన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ...క్షేత్ర అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో కలిసి పాపినాశి, సంగమేశ్వర ఆలయాలను పరిశీలించినట్లు తెలిపారు. హైలెవల్ కమిటీతో కలిసి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. ప్రణాళికల వివరాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగ్ రావు, రాష్ట్ర టూరిజం శాఖ ఎస్ఈ సరిత, ఆర్డీఓ అలివేలు, దేవాదాయ శాఖ అడిషనల్ కలెక్టర్ కృష్ణవేణి, ఆర్కిటెక్ట్ సూర్య నారాయణ మూర్తి, టెంపుల్ డిజైనర్ గోవింద హరి, స్థపతి వాలినాయగం, ఈఓ పురేందర్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం వారు జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
గద్వాల – అలంపూర్ రోడ్డులో సుందరీకరణ పనులు
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ... జోగుళాంబ ఆలయం జాతీయ రహదారి పరిధిలో ఉండటంతో గద్వాల నుంచి అలంపూర్ వరకు రోడ్సైడ్లో ఆర్చీలు, అవెన్యూ ప్లాంటేషన్, సైన్న్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం వద్ద శుభ్రమైన వాతావరణం, బస్ స్టాండ్, సౌకర్యవంతమైన గదులు, శుద్ధమైన ఆహారం, పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలంపూర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ మంచి సూచనగా భావిస్తున్నట్టు తెలిపారు. రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసేవిధంగా ప్రణాళికలు సిద్దమవ్వాలన్నారు.

జోగుళాంబ క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ప్లాన్