
ఎస్సీ, ఎస్టీ కేసులు పరిష్కరించండి
● అసమానత్వం, అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
● ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 62 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా.. 19 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. మిగతా కేసులకు చార్జీషీట్ వేసినట్లు తెలిపారు. అదే విధంగా ఒక కేసులో నిందితులకు శిక్ష పడినట్లు ఎస్పీ వెల్లడించారు. 32 కేసులకు సంబంధించి రూ. 38.75లక్షల నష్టపరిహారం చెల్లించినట్లు వివరించారు. ఈ సందర్బంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్కు పలు సమస్యలపై బాధితులు వినతిపత్రాలను అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, కమిటీ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రాంబాబునాయక్, ప్రవీణ్, ఆర్డీఓ అలివేలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్బాబు, డీఎస్పీ మొగులయ్య తదితరులు ఉన్నారు.
గద్వాల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్ బీఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. దళితుల అణచివేత, అసమానత్వం, అట్రాసిటీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోందన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ రెండు గ్లాసుల విధానం, కులవివక్ష వంటివి కొనసాగడం విచారకరమన్నారు. ప్రతినెలా చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎస్ఐలు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా రాయపురం గ్రామంలో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయని.. ఆర్డీఓ, డీఎస్పీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు సైతం వారికే కేటాయించాలన్నారు. నిధుల దుర్వినియోగం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనపై నివేదికను కమిషన్కు సమర్పించాలని ఆదేశించారు. రైతులకు అన్యాయం జరగకూడదన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కులాంతర వివాహాలు, అంబేడ్కర్ విద్య తదితర పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు కలగాలి..
అలంపూర్: శ్రీజోగుళాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వానికి శక్తి సామర్థ్యాలు కలగాలని రాష్ట్ర ఎస్పీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆకాంక్షించారు. అలంపూర్ ఆలయాలను చైర్మన్తో పాటు సభ్యులు కుశ్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్, రెణికుంట్ల ప్రవీణ్ సందర్శించగా.. ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ మొగులయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్బాబు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయాలకు చేరుకున్న వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని శేషవస్త్రాలతో సత్కరించి.. తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పురేందర్ కుమార్, తహసీల్దార్ మంజుల, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారిణి సుజాత, సీఐ రవిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల వివరాలను వివరించారు. కులాంతర వివాహాల కింద 59 దరఖాస్తులు వచ్చాయని.. ఆరు జంటలకు రూ. 15లక్షల చొప్పున ప్రోత్సాహాకాన్ని అందించినట్లు తెలిపారు. మిగతా వారికి నిధులు వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో ఎస్సీ, ఎస్టీ కోటా ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్లు వివరించారు.