
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
గద్వాల: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిరుపేదలైన అర్హులకు మాత్రమే అందించాలన్నారు. ఎల్–1 జాబితాలో ఉన్న 50వేల మంది లబ్ధిదారుల నుంచి నియోజకవర్గానికి 3500 చొప్పున ఏడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో బేస్మెంట్ స్థాయి పూర్తి చేసుకున్న 20 మందికి మొదటి విడతగా రూ.1లక్ష చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. పనులు వేగవంతంగా పూర్వయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30వ తేదీన ముగుస్తుందని గడువు పెంచే అవకాశం లేనందున అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో నిర్ణీత లక్ష్యం మేరకు పన్ను వసూళ్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు హౌసింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల నియామకం..
గద్వాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కాలేజీలో అవసరమైన ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు, అసోసియోట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర నియామకానికి సంబంధించిన వివరాలను శనివారం నాటికి అందజేయాలన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఈసమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్ ఇందిర, కాలేజీ ప్రిన్సిపల్ నాగేశ్వర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.