మొగుళ్లపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత దాసారపు నరేష్ రచించిన పురిటి నొప్పులు పోస్టర్ను తహసీల్దార్ సునీత మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ గేయాన్ని ఆలపించిన అంకుశాపూర్ గ్రామానికి చెందిన జీడి అనితను అభినందిస్తూ సామాజిక చైతన్య గీతాలు ఇంకా ఎన్నో పాడాలని, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అమ్మ ప్రేమను వెలకట్టలేమనీ, ఎన్ని జన్మలెత్తినా అమ్మ రుణం తీర్చలేమని, కన్నతల్లి ప్రేమను మరువద్దని, జీవితాంతం అమ్మను కంటి రెప్పల కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంద సాంబయ్య, డీలర్ల జిల్లా కార్యదర్శి గంగాదార్ రాజు, జీడి సంపత్ ,గాయకులు పుల్ల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
రూ.వెయ్యి కోట్లు
కేటాయించాలి
మహాముత్తారం: రాష్ట్రంలో సేవాలాల్ మహారాజ్ ఆలయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వంద ఎకరాల స్థలంలో పాటు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని లంబాడిహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో మూడవస్థానం కలిగిన లంబాడ జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడే తమ ఇంటి ఇలవేల్పు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరినట్లు తెలిపారు.
కాంగ్రెస్లో చేరిక
మహాముత్తారం: మండల కేంద్రానికి చెందిన సినియర్ బీఆర్ఎస్ నాయకుడు రామచంద్రం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొంగొర్ల బాపు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాటి లచ్చయ్యగౌడ్ ఉన్నారు.
ఏటూరునాగారం: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలైన సంఘటన మండలంలోని జీడివాగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. మంగపేటకు చెందిన సోడి సమ్మక్క అనే మహిళ శుభకార్యానికి ఏటూరునాగారం వచ్చి మంగపేట వైపు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కిందపడింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108కు సమాచారం ఇవ్వడంతో టీఎంటీ పర్వతాల రాజ్కుమార్, పైలెట్ భరత్ సహాయంతో బాధితురాలిని ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంగపేట: మండలంలోని ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న గ్రామాల్లో ఇసుక లారీల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలు జరుగకుండా ఉండే విధంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. జిల్లా సరిహద్దు నుంచి కమలాపురం వరకు సుమారు 22 కిలోమీటర్ల దూరం వరకు 11 గ్రాపంచాయతీల పరిధిలోని గ్రామాల మద్య నుంచి ప్రధాన రహాదారి ఉంది. రోడ్డుపై నుంచి నిత్యం వందల సంఖ్యలో ఇసుక లారీలు అతి వేగంగా ఒకదాని వెంట మరోటి రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే గ్రామాల ప్రజలు రోడ్డు దాటాలంటే ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా గ్రామాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


