ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో పర్యాటక రంగానికి సరికొత్త కళ రానుందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు. సోమవారం తన ఛాంబర్లో పర్యాటక శాఖకు సంబంధించిన బ్రోచర్, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని పర్యాటక శోభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ నెల 23 వరకు జిల్లాలో పర్యాటక వారోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 20న బుధవారం ములుగు మండలంలోని జాకారం శివాలయం వద్ద హెరిటేజ్ వాక్ నిర్వహించాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజిని ఆదేశించారు. 21న గురువారం యూట్యూబర్స్ సోషల్ మీడియా, ఇన్ఫ్లుయేన్నర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని డీపీఆర్ఓను ఆదేశించారు. ఈ నెల 31లోగా సేవా గుణం కలిగిన ప్రతిఒక్కరూ రెడ్ క్రాస్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. అలాగే తాడ్వాయి డివిజన్ పరిధిలోని తాడ్వాయి టీ రేంజ్, లవ్వాల సెక్షన్, దేవునిగుట్ట వెస్ట్ బీట్లో 39వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ విక్రమ్ సింగ్ ఠాకూర్ అధ్వర్యంలో అడవి మంటల నిర్వహణపై నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని డీఏఓ వికాస్ మీనాతో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పరిశీలించారు. అనంతరం మేడారంలోని వనదేవతలను సందర్శించారు. అమ్మవార్ల గద్దెల వద్ద కలెక్టర్ హేమంత్ సహదేవరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


