భూపాలపల్లి రూరల్ : ప్రజాపాలన–ప్రగతిప్రణాళికలో భాగంగా సోమవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్, నాగారం గ్రామాల్లో యువజన వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దాపూర్ బస్టాండ్ నుంచి సుబ్బక్కపల్లి సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు పరుగుపోటీలు నిర్వహించారు. నాగారంలో వాకథాన్తో పాటు యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎంపీడీఓ తరుణ్, ఎంపీఓ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యువకులు, పంచాయతీ కార్యదర్శులు, పెద్దాపూర్, గుర్రంపేట, బావ్సింగ్పల్లి, రామ్ నాయక్ తండా, సుబ్బక్కపల్లి గ్రామాల సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
చిట్యాల : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో యువజన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలో 2కే మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రం నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు కొనసాగిన మారథాన్ను ఎంపీఒ రామకృష్ణ, సర్పంచ్ తౌటం లక్ష్మి ప్రారంభించారు. క్రీడలు యువతలో శరీర దారుఢ్యంతో పాటు, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. నిత్యం రన్నింగ్, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్, వార్డు సభ్యులు నవీన్, పంచాయతీ కార్యదర్శి దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.
మొగుళ్లపల్లిలో..
మొగుళ్లపల్లి : యువజన వారోత్సవాల సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సోమవారం 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, సర్పంచ్ విజయ, ఎస్సై సురేష్, ఎంఈఓ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.


