● డీఈఓ రాజేందర్
భూపాలపల్లి అర్బన్: నేటి విద్యార్థులే దేశ భవిష్యత్కు మార్గదర్శకులు అని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ హాల్లో ఆదివారం నిర్వహించిన విద్యా విజయోత్సవం కార్యక్రమంలో డీఈఓ రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా దేశ భవిష్యత్ను తీర్చిదిద్దే శక్తులుగా ఎదగాలని సూచించారు. నైతిక విలువలను పెంపొందించుకుంటూ సామాజిక సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, నాయకత్వ లక్షణాలు, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధించాలని తెలిపారు. సమాజ పురోగతికి విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అవసరమన్నారు. ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, ఒక్కొక్కరికి రూ.10వేల నగదు బహుమతులతో సత్కరించారు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చిన ముగ్గురు వాలంటీర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి సామల రమేష్, క్వాలిటీ కోఆర్డినేటర్ పింగిళి విజయపాల్రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, జీసీడీఓ శైలజ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ రామకృష్ణ, సిబ్బంది కృష్ణమోహన్, కిషన్రెడ్డి, శ్రీకాంత్, హేమలత, మహేందర్రెడ్డి, మల్లికార్జున్, శారద, శ్రీవాణి పాల్గొన్నారు.
వరేణ్య సుమహిత నృత్య విభాగంలో..
కాళేశ్వరం: విద్యావారోత్సవాల్లో భాగంగా టీజీఎంఎస్ గణపురంలో నిర్వహించిన ఆర్ట్ అండ్ కల్చర్ కార్యక్రమంలో కాళేశ్వరంలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల చెందిన విద్యార్థిని మాడుగుల వరేణ్య సుమహిత నృత్య విభాగంలో ప్రథమ స్థానంలో సాధించింది. ఈ మేరకు డీఈఓ రాజేందర్ వరేణ్య సుమహితకు బహుమతి అందజేశారు.


