మల్హర్/మల్హర్(కాటారం): ఽజాప్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం మల్హర్ మండలం కొయ్యూరు, కొండంపేట, కాటారం మండలంలోని కొత్తపల్లి, కాటారం వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద తార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రవాణా సమస్య ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. రోజుకు రెండు లారీలు కొనుగోలు కేంద్రాలకు పంపాలని ఆదేశించారు. కచ్చితమైన రిజిస్టర్లు ఏర్పాటు చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని శుభ్రపరచాలని తాలు, రాళ్లు, మట్టి గుల్లలు లేని నాణ్యమైన ధాన్యాన్ని మిల్లులకు పంపించేందుకు రైతుల సహకరించాలన్నారు. ప్యాడీ క్లీనింగ్ పరికరాలు అందుబాటులో లేకపోతే మరొకచోట నుంచి తెప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, డీఆర్ఓ వసంతకుమారి, పౌర సరఫరాల అధికారి కిరణ్కుమార్, డీఎం రాములు, సహకార అధికారి వాలియానాయక్, వ్యవసాయ అధికారి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


