గతం కంటే మేలు..
జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో సాగు
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వం పంటల రుణ, పరిమితిని పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి వానాకాలం, యాసంగి పంటల రుణ పరిమితి పెంచింది. ఎకరాకు ఏ పంటకు ఎంత రుణం ఇవ్వాలని ఖరారు చేస్తూ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ కి పంపించింది. దీంతో పంట రుణాల వరిమితిని పెంచుతూ ఎస్ఎల్బీసీ జిల్లా, మండలాల బ్యాంకర్లకు సర్క్యులర్ పంపించింది. దీంతో ఈ రుణ పరిమితిని ఏప్రిల్ నుంచి వర్తింపజేయనున్నట్లు సమాచారం. 128 రకాల పంటలతో పాటు కోళ్లు, గొర్రెలు, మేకలు, పందులు, తేనెటీగలు, చేపల పెంపకం తదితర యూనిట్లకు ఈ రుణపరిమితి వర్తించనుంది.
సాగు విస్తీర్ణం ఇలా..
జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 1,26,407 మంది పంట రుణాలకు అర్హులు. కాగా, వీరిలో 78 శాతం మందికే రుణాలు అందుతున్నాయి. మిగతా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకర్లు ఇస్తున్న పంట రుణాలకు తక్కువ వడ్డీ ఉండగా పట్టా పాస్బుక్ కలిగిన ప్రతీ రైతు సమీపంలోని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్రభుత్వం పంట రుణపరిమితి పెంచడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. నాకు ఐదెకరాల సాగుభూమి ఉంది. ఏటా అవసరానికి సరిపడా పంట రుణం తీసుకుంటున్నాను. రుణ పరిమితి పెంచడం సాగును ప్రోత్సహించడమే.
– తరాల విష్ణు, రైతు, కొత్తపల్లి (ఎస్ఎం)
పంటల రుణ పరిమితి పెంచడంతో వరికి గతేడాది ఎకరాకు రూ.46 వేలు ఉండగా ప్రస్తుతం రూ.48 వేలు అందనుంది. పత్తికి రూ.4 వేలు, మిర్చికి రూ.4 వేలు, కందికి రూ.2 వేలు, సోయాకు రూ.2 వేలు, పెసర, జొన్న, మక్క, పంటలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు అదనంగా రానున్నాయి. దీంతో పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులకు ఇబ్బందులు లేకుండా ఉపశమనం కలగనుందని పలువురు రైతులు పేర్కొంటున్నారు. కాగా, ఐదెకరాలకు పైగా ఉన్న రైతులకు రూ.2 లక్షలకు మించి రుణాలివ్వడంలేదని.. బ్యాంకర్లు కండిషన్లు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల నేపథ్యంలో రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రటించి కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవడంతో చాలామంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ కాలేదు. దీంతో రైతులు రూ.2 లక్షల లోపు పరిమితితోనే రుణాలు తీసుకుంటున్నారు.
పెంచిన రుణ పరిమితి సౌకర్యాన్ని రైతులు వినియోగించుకోవాలి. తీసుకున్న రుణాలు గడువులోపు చెల్లించిన రైతులకే వడ్డీ రాయితీ వర్తిస్తుంది. రుణ పరిమితి పెంపుతో రైతులకు ఉపయోగంగా ఉంటుంది.
– తిరుపతి, లీడ్ బ్యాంక్ మేనేజర్
ఏప్రిల్ 10 నుంచి రుణాల పంపిణీ
1,26,407 లక్షల మంది రైతులకు మేలు


