● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: వాహన డ్రైవర్లకు కంటిచూపు ప్రధానమని, కంటిచూపు మందగింపుతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సింగరేణి ఫంక్షన్ హాల్లో శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో జిల్లాలోని వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా ఆటో, లారీ డ్రైవర్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, స్థానిక సీఐ డి.నరేష్కుమార్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.
రాజీతో సమస్యలను పరిష్కరించుకోండి
ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులను పరస్పర సమ్మతితో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.
చిట్యాల: మండలకేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన సరిగొమ్ముల నాగరాజ్ ఇంట్లో అక్రమంగా ఎనిమిది గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచారు. దీంతో నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లయీస్ ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో ఏఎస్సైలు సమ్మిరెడ్డి, మధుసూదన్, కానిస్టేబుల్ లాల్సింగ్, హోంగార్డ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.


