పొగమంచులో ప్రయాణాలొద్దు
భూపాలపల్లి: వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరం ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల పొగమంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులను గమనించే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుందన్నారు. అల్ప నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలు నివారించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. వాహనాలను వేగంగా నడప కూడదని, శ్రద్ధగా, నిదానంగా ప్రయాణించాలన్నారు. తక్కువ దూరం మాత్రమే కనిపించే పరిస్థితుల్లో హెడ్లైట్లను లో బీమ్లో ఉంచి, ఫాగ్ లైట్లను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. అత్యవసరంగా ప్రయాణం తప్పనిసరి అయినప్పుడు బ్రేకులు, లైట్లు, టైర్లు వంటి వాహన భాగాలను తప్పకుండా ముందుగానే తనిఖీ చేసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అకస్మాత్తు ఓవర్టేక్లు, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు ప్రమాదకర చర్యలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. పోలీసుల సూచనలు, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా వాహనదారులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడమే లక్ష్యమని వివరించారు.
ఎస్పీ కిరణ్ ఖరే


