భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి
మల్హర్: మల్హర్ మండలం తాడిచర్ల బ్లాక్–1 ఓపెన్కాస్ట్ మైన్కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జెన్కో సీఎండీ హరీశ్, కలెక్టర్ రాహుల్ శర్మ, థర్మల్, కోల్ డైరెక్టర్లతో కలిసి తాడిచర్ల–1 కోల్ బ్లాక్ ఓపెన్కాస్ట్ మైన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపెన్కాస్ట్ కార్యకలాపాలు, బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, భద్రతా ప్రమాణాలు, పర్యావరణ చర్యలు తదితర వాటిని ఆయన పరిశీలించారు. మైనింగ్ వ్యూపాయింట్ ద్వారా తాడిచర్ల గ్రామాన్ని, వాహన ప్రాంగణం, యంత్రాలను, ఫీడర్ బ్రేకర్ పరిశీలించారు. అనంతరం ఏఎమ్మార్ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పునరావాస చర్యలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయాలని సూచించారు.
కన్వేయర్ బెల్ట్ నిర్మాణంపై సమీక్ష
తాడిచర్ల (కాపురం) నుంచి కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం, రవాణామార్గం, దూరాబారాలపై జెన్కో సీఎండీ హరీశ్, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కన్వేయర్ బెల్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, రహదారి మార్గం, భద్రతా చర్యలు, నిర్వహణ ప్రక్రియపై వివరాలు నివేదికను సీఎండీకి అందించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. కన్వేయర్ బెల్ట్ నిర్మాణం పూర్తయితే రహదారి రవాణాపై భారం తగ్గి సమర్థవంతంగా బొగ్గు పంపిణీ జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో నిరంతరాయ విద్యుత్ సరఫరా జరగాలని ఆయన సూచించారు. కేటీపీపీలో 28 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో థర్మల్ డైరెక్టర్ రాజశేఖర్రెడ్డి, కోల్ డైరెక్టర్ నాగ్యా, విద్యుత్ శాఖ ఈడీ లక్ష్మయ్య, కేటీపీపీ సీఈ ప్రకాశ్, ఎస్ఈ ముత్యాలరావు, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్నాయక్, ఏఎమ్మార్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
నవీన్ మిట్టల్
భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేయాలి


