
బలోపేతం దిశగా..
కాటారం: అంగన్వాడీ కేంద్రాలను బలోపేతంచేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంతో పాటు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుంది. ప్రస్తుతం కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రాల నిర్వహణలో మార్పులు తీసుకురావడంతో పాటు సేవలను మరింత విస్తృత పరిచేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తుంది. చిన్నారులకు ఎంతో ప్రాముఖ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను పక్కాగా అందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆటపాటలతో కూడిన విద్య..
గ్రామాల్లో రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ఈ నెల 11నుంచి అమ్మ మాట–అంగన్వాడీ బాట పేరుతో పలు కార్యక్రమాల నిర్వహణ చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలో టీచర్లు, సిబ్బంది తమ కేంద్రాల పరిధిలో రోజుకో కార్యక్రమం చేపడుతున్నారు. కార్యక్రమం ముగింపులో భాగంగా ఈ నెల 17న సామూహిక అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు దీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా సెలబస్ రూపొందించి విద్యను బోధించడానికి సిద్ధమయ్యారు. చిన్నారులు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు నేర్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుంది.
బడిబాట పట్టేలా..
అంగన్వాడీ కేంద్రాల్లోని 3నుంచి 6ఏళ్ల పిల్లలను బడిబాట పట్టించేందుకు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా భావించే వారు. చిన్నారులు పాఠశాల వాతావరణానికి అలవాటుపడేలా, పౌష్టికాహారం అందించి ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టేలా తీర్చిదిద్దేవారు. గతేడాది నుంచి అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం, ఆటపాటలతో గడపడమే కాకుండా వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్క్బుక్కులు అందించి వారితో హోంవర్క్ చేయిస్తున్నారు. ఎల్కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరుతో ఐదు పుస్తకాలు రూపొందించి ఆటపాటలతో బోధించారు. ప్రస్తుతం నిపుణ్ భారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యాబోధన చేపట్టనున్నారు. దీంతో చిన్నారుల మేథస్సు వికసించడంతో పాటు మానసిక మార్పులు చోటు చేసుకోనున్నాయి.
చిన్నారుల సంఖ్య పెంచేలా..
ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు చర్యలు చేపడుతున్నారు. కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచడం కోసం కసరత్తు చేస్తున్నారు. అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరిస్తున్నారు. చిన్నారులకు ప్రీ ప్రైమరీ విద్య ఆవశ్యకత, అంగన్వాడీలకు పంపించడం ద్వారా వారికి చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు.
చిన్నారుల సంఖ్య పెంచేలా
కార్యక్రమాలు..
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వ ఆదేశాలతో అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో పలు కార్యక్రమాలు చేపట్టి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు, ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అమలు తీరుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీకి పంపించడం ద్వారా వారిలో మేథాశక్తి పెంపొందుతుంది.
– మల్లీశ్వరి, డీడబ్ల్యూఓ
అంగన్వాడీలపై
దృష్టి సారించిన ప్రభుత్వం
అమ్మ మాట–అంగన్వాడీ బాట
పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు
చిన్నారుల సంఖ్య పెంచేలా కసరత్తు
17వరకు పలు కార్యక్రమాల నిర్వహణ
జిల్లా వివరాలు..
మండలాలు 12
ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు 2
(భూపాలపల్లి, మహదేవపూర్)
అంగన్వాడీ కేంద్రాలు 643
చిన్నారుల సంఖ్య 10,364(సుమారు)

బలోపేతం దిశగా..