
ఆపదకాలంలో ఆదుకునేందుకు రక్తదానం
భూపాలపల్లి అర్బన్: ఆపదకాలంలో ఆదుకునేందుకు ప్రతి ఏడాది రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఐటీ మాస్టర్ నిర్వాహకుడు శంకర్ తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐటీ మాస్టర్ యాజమాన్యం, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయూ జిల్లా కమిటీ) ఆధ్వర్యంలో శనివారం ఐటీ మాస్టర్ క్యాంపస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. 2008వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం ఐటీ మాస్టర్ యజమాన్యం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఎంజీఎంలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు, ప్రజలకు చికిత్స నిమిత్తం అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి జర్నలిస్టులతో పాటు ప్రజాసంఘాలు, స్టూడెంట్స్, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా 280 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు క్యాతం సతీష్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.