
రాజీమార్గంతో వివాదాలకు దూరం
భూపాలపల్లి అర్బన్: రాజీమార్గాన్ని ఎంచుకొని వివాదాలు లేని జీవితాలను గడపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్ రమేశ్ బాబు అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. చిన్న చిన్న విషయాల్లో పంతాలకు పోయి గొడవలు పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకొని రాజీపడి కేసుల్లో నుంచి బయటపడాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. క్షమాగుణాన్ని కలిగి ఉండడం గొప్ప విషయం అన్నారు. ప్రతిఒక్కరు సోదరాభావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
రమేష్ బాబు