
విమానాశ్రయానికి మరో అడుగు
సాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనేపథ్యంలో సమీప గ్రామాల ప్రజల నుంచి సేకరించే భూమికి పరిహారం నిర్ణయించడం.. అందుకు భూనిర్వాసితులు సానూకూలత వ్యక్తం చేయడంతో విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు పడ్డట్లైంది. కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ నిర్వాసితులతో చర్చించింది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887 ఇస్తామని, అంతకు మించి పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి భూనిర్వాసితులు భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. వీరిలో గుంటూరుపల్లికి చెందిన కొందరు రైతులు తమ భూములు మెయిన్ రోడ్డుకు ఉన్నాయని, ఇంకాస్త ఎక్కువ ధర వస్తుందన్న ఆలోచనలో ఉన్నవారితో తహసీల్దార్, ఆర్ఐ తదితరులు చర్చించి ఎక్కువ ధర ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. కలెక్టర్ తనకున్న విచక్షణాధికారాలతో జనరల్ అవార్డు కింద రూ.65 లక్షలు ఉంటే కన్సంట్ అవార్డు కింద రూ.కోటి 20లక్షల వరకు తీసుకొచ్చారని వివరించారు. గత బుధ, గురువారాల్లో జరిగిన భూసేకరణ ధర పెంపు నిర్ణయంపై సమావేశంలో పాల్గొనని రైతులకు కూడా ఈ విషయమై స్పష్టతనిచ్చారు. అయితే తమ భూములు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న చాలా మంది రైతులు అవసరమైన వివరాలు, పత్రాలు(పాస్పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, పాస్బుక్) సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు ఇప్పటికే డాక్యుమెంట్లు ఇచ్చారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కలెక్టర్ సత్యశారద నిర్ణయంతో మరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు అదనంగా అవసరం కానుండడంతో ఇప్పటికే ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించినట్టు తెలిసింది.
భూసేకరణ కాగానే పనులు మొదలు..
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయం ఉండొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్కు ఒప్పందం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరపడంతో గతేడాది నిరంభ్యంతర పత్రం వచ్చింది. 2024 నవంబర్లోనే 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయిస్తూ జీఓను ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ సైతం భూ సేకరణ ప్రక్రియ ఓ కొలిక్కి రాగానే పనులు ప్రారంభించేందుకు రూ.450 కోట్లు నిధులను కేటాయించింది. భూ సేకరణ ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే ఏఏఐ విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, అది కూడా పూర్తి కావచ్చింది. భూ నోటిఫికేషన్ ప్రకారం రైతులు తమ భూపత్రాల వివరాలు ఇవ్వగానే, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూనే భూమి సేకరించనుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు పలు దఫాలుగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించే వీలున్న 37.6 మీటర్లు పొడవున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.
మామునూరు ఎయిర్పోర్ట్
భూనిర్వాసితులతో చర్చించిన అధికారులు
ధరల నిర్ణయాలపై
మెజార్జీ నిర్వాసితుల సానుకూలత
వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు..
వ్యవసాయేతర భూములకు
గజానికి రూ.4,000..