
పత్తాలేని వర్షాలు
టీపీసీసీలో నేతలకు పదవులు
కాంగ్రెస్ అధిష్టానం సోమవారం రాత్రి ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉమ్మడి జిల్లా నాయకులకు కీలక పదవులు కట్టబెట్టింది.
వాతావరణం
జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
వారం రోజులుగా రైతుల ఎదురుచూపు
– 8లోu
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో రోహిణి కార్తెలో ముందస్తు వర్షాలు మురిపించినా వారం రోజులుగా జాడ లేకపోవడంతో అన్నదాతలు వరుణుడి కరుణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ యేడు మే చివరి మాసంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో అన్నదాతలు ఉత్సాహంగా పంటల సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వానాకాలం సీజన్లో పత్తి, మొక్కజొన్న కంది పంటలను వర్షాధారంగానే సాగు చేస్తారు.
2,47,293 ఎకరాలలో సాగు..
వానాకాలం సీజన్లో జిల్లాలో 2,47,293 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మే 20వ తేదీ నుంచి 30వరకు భారీ వర్షాలు కురిసిన తర్వాత ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడక్కడా మొలకెత్తిన పత్తి మొలకలు వాడిపోతున్నాయి. జిల్లాలో జూన్ 1నుంచి 9వరకు సాధారణ వర్షపాతం 60 మి.మీ.లు కాగా, ఇప్పటి వరకు 23 మీ.మీల లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తుంది. దాదాపుగా అన్ని మండలాల్లో అధిక లోటు వర్షపాతం కనిపిస్తుంది. మరో రెండు మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే వేసిన విత్తనాలు నేలపాలయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం రెండు మూడురోజుల్లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జూన్ ప్రారంభం నుంచి..
జూన్ ప్రారంభం నుంచి వర్షాల జాడే కనిపించడం లేదు. వానాకాలం సీజన్ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు రావడం లేదు. జూన్ 1నుంచి 9వరకు జిల్లాలో కనిష్టంగా 23 మి.మీ.ల వర్షం కురిసింది. జూన్ ప్రారంభం నుంచి వర్షాలు కురిసి ఉంటే ఇప్పటివరకు 50శాతం పంటల సాగు పూర్తయ్యేదని రైతులు చెబుతున్నారు. మే చివరి మాసంలో కురిసిన వర్షాలకు సాగునీటి వసతి ఉన్న కొంతమంది రైతులు పత్తి విత్తనాలను వేశారు. నేలలో సరైన తేమ ఉంచడంతో ఇప్పటికే విత్తనాలు కూడా మొలకెత్తాయి. వారం రోజులుగా వర్షపు జాడ కనిపించకపోవడంతో మొలకలు వాడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. కొంతమంది రైతులు స్పింకర్ల ద్వారా మొలకలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. నీటివసతి లేని రైతులు మాత్రం వరుణుడి కరుణపైనే భారంవేస్తూ వదిలేస్తున్నారు. ఎకరానికి రూ.10వేల వరకు ఖర్చుచేసి విత్తనాలను విత్తినట్లు చెబుతున్నారు. అధికారులు మాత్రం ముందస్తు వర్షాలకే తొందరపడవద్దంటూ సూచిస్తున్నారు. పత్తి, మొక్కజొన్న పంటల సాగుకు మరింత సమయం ఉందని పేర్కొంటున్నారు.
తప్పని ఎదురుచూపు
జిల్లాలో ఎక్కువగా వర్షాధార వంటలనే సాగుచేయడంతో వరుణుడి కరుణ కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో రైతులు వర్షాలకోసం గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు. నైరుతి రుతుపవనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చిట్యాల, రేగొండ, టేకుమట్ల, భూపాలపల్లి మండలాల్లో కొంతమంది రైతులు పత్తి విత్తనాలు విత్తారు. జిల్లావ్యాప్తంగా 25శాతం పంటల సాగు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగితా పంటల సాగును వర్షాలు కురిసిన తర్వాతనే చేపట్టే అవకాశం కనిపిస్తుంది. కొంత మంది రైతులైతే మే మాసంలోనే పొడినేలల్లోనే విత్తనాలు వేసి వదిలేశారు. వర్షాలు కురవగానే పత్తి విత్తనాలు మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నారు.
ఆశపెట్టిన రోహిణి..
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు కొడతాయన్న నానుడి ఉండేది. కానీ ఈ యేడు రోహిణి కార్తెలోనే భారీ వర్షాలు కురవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో ఆదరాబాదరగా అన్నదాతలు పంటల సాగును ప్రారంభించారు. జూన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు వర్షాలు కురవకపోవడంతో అన్నదాతల అంచనాలు తారుమారవుతున్నాయి. ముందస్తు వర్షాలతో మురిపించినా తొలకరి వర్షాలు కరుణించడం లేదంటున్నారు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె మొదలైనా వరుణుడు కరుణించకపోవడం గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంది. దీంతో పంటల సాగు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. నేలలో 60నుంచి 70శాతం తేమ ఉంటేనే విత్తనాలను విత్తుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నల్లరేగడి నేలల్లో కొంత తేమ ఉన్నా చలక నేలలు మాత్రం బీటలు వారి కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విత్తనాలను విత్తుతే మొలకెత్తే పరిస్థితి ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు.
రోహిణి కార్తెలో ముందస్తు
వర్షాలకు మురిసిన రైతులు
ఇప్పటివరకు
25శాతం పంటల సాగు పూర్తి
వాడిపోతున్న పత్తి మొలకలు