
ఏడాదిన్నరగా ఎదురుచూపు
కాటారం: కౌలు రైతులకు సైతం ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయం అందజేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదు. హామీ ఇచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంట సాగుతో వచ్చిన కొంత మొత్తంతో వడ్డీలు కట్టలేక ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. ప్రతి సీజన్లో ప్రభుత్వం నుంచి సహాయం అందక పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు.
సుమారు 40వేల మంది కౌలు రైతులు..
జిల్లాలో సుమారు 40వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నట్లు 2016లో ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో తేలింది. అరెకరం, ఎకరం భూమి ఉన్న రైతులు ప్రతి ఏటా తమకున్న కొద్దిపాటి భూమితో పాటు ఇతరుల భూములు కౌలుకు తీసుకొని పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. గతేడాది పత్తి, మిర్చి తోటలకు ఎకరాకు కౌలుకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు చెల్లించేవారు. ప్రస్తుతం రూ.20వేల వరకు పెరిగింది. వరి పొలాలకు రూ.10వేల నుంచి రూ.12వేల వరకు కౌలు ఉండగా రూ.15వేల వరకు భూ యజమానులు కౌలు రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. పంట చేతికొచ్చినా, రాకపోయినా కౌలు మాత్రం చెల్లించాల్సి వస్తుంది. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో కౌలు, చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం నానా పాట్లు పడుతున్నారు.
కౌలు రైతుకు అందని పెట్టుబడి సాయం
పంట సాగు వివరాలు..
పెరిగిన కౌలు, విత్తన, ఎరువుల ధరలు
నెరవేరని కాంగ్రెస్ ప్రభుత్వ హామీ
ప్రైవేట్ అప్పులతో
కౌలు రైతుపై ఆర్థిక భారం
ఏడాదిన్నరగా ఎదురుచూపు..
ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతులతో పాటు కౌలు రైతులను ఆదుకుంటామని స్పష్టంగా పేర్కొంది. అర్హులైన ప్రతి కౌలు రైతుకు ఏడాదికి రూ.15వేలు సహాయంగా అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ఆ హామీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు సహాయం అందుతుందని రైతులు భావించినప్పటికీ నిరాశే మిగిలిపోయింది. మూడు సీజన్లు గడుస్తున్నప్పటికీ కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు.