
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఏడాది కాలంగా కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ విడదల రజిని మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నా ఈ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని అన్నారు. దీనికి పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని ధ్వజమెత్తారు.
👉అనంతపురం జిల్లాలో తన్మయి అనే ఇంటర్ విద్యార్ధిని కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆరు రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు సదరు విద్యార్థిని దారుణమైన స్థితిలో హింసకు గురై చనిపోయినట్లుగా గుర్తించామని పోలీసులు ప్రకటించారు. పోలీసులకు ఫిర్యాదు అందిన ఆరు రోజుల్లోనే వారు సరైన రీతిలో దీనిపై దర్యాప్తు చేసి ఉంటే, ఈ రోజున తన్మయి అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యేదేనా? పోలీసుల నిర్లక్ష్యం వల్ల సదరు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమె కోసం గాలించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. ఇది పోలీసుల వైఫల్యం కాదా? దీనిపై అందరూ ప్రశ్నిస్తుంటే, దానిని కప్పిపుచ్చుకునేందుకు అనేక సాకులను తెర మీదికి తీసుకువస్తారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏడాదిగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అదుపుతప్పిన శాంతిభద్రతలను గాడిలో పెట్టే ఆసక్తి ఈ ప్రభుత్వానికి లేదు. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేస్తే, స్థానిక ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తేనే దానిపైన స్పందిస్తున్నారు.
కొమ్మినేని అరెస్ట్.. దారుణం
ఈ ప్రభుత్వంలో నిజాయితీ లేదు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే లేదు. పోలీస్ వ్యవస్థను చట్టాలకు అనుగుణంగా నడిపించాలనే ఉద్దేశం అంతకంటే లేదు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి నిత్యం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. ఇటీవలే సాక్షి టీవీ డిబేట్లో ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను సాక్షిటీవీ యాజమాన్యంతో పాటు వైయస్ఆర్సీపీ అందరూ ఖండించారు. దీనిని ఎవరూ సమర్థించడం లేదని చాలా స్పష్టంగా ప్రకటించాయి. అయినా కూడా టీడీపీ దీనిలో రాజకీయాన్ని వెతుక్కుని సాక్షియాజమాన్యాన్ని, వైయస్ఆర్సీపీని, మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతమ్మను కూడా వివాదంలోకి లాగుతున్నారు. జర్నలిస్ట్ మాట్లాడిన మాటలకు వీరికి ఏం సంబంధం? పదేపదే దీనిని కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇందుకోసం మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ చేస్తున్న వ్యవహారం వల్లే మహిళలకు అవమానం జరుగుతోంది.
చివరికి సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సామాజిక అంశాలపై చక్కని విశ్లేషణను, చర్చను సమాజానికి అందిస్తున్నారు. ఆయనను కూడా ఈ వివాదంలోకి లాగి అరెస్ట్ చేయడం చూస్తుంటే, రెడ్బుక్ పాలన పరాకాస్టకు చేరిందని అర్థమవుతోంది. ఏడాది కాలంలో రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోంది. వైయస్ఆర్సీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సోషల్ మీడియా యాక్టివీస్ట్లు, చివరికి జర్నలిస్ట్ల వరకు ఈ రెడ్బుక్ వేధింపులు వచ్చాయి. సాక్షి డిబేట్లో సదరు జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను కొమ్మినేని వారించారు, తరువాత దానిపై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా ఆయనను అరెస్ట్ చేశారంటే తమను ఎవరు ప్రశ్నించినా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తామనే భయాన్ని సృష్టించడానికి ప్రయత్నించారు.
ప్రశ్నిస్తున్న సాక్షిపై చంద్రబాబు కక్షసాధింపు
ప్రజల గొంతుకగా నిలుస్తున్న సాక్షి మీడియాపై ఈ రోజు దాడులు చేస్తున్నారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వంలోని అరాచకాన్ని ప్రశ్నిస్తున్నందుకు చంద్రబాబు సాక్షిపై కక్ష పెంచుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రశ్నించినందుకు సాక్షిపై కోపం పెంచుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది. దీనిని వెలుగులోకి తీసుకువస్తున్న సాక్షిమీడియాపై దాడులకు తెగబడుతున్నారు. ఇదేనే ప్రజాస్వామ్యం? ఏడాది పాలన వైఫల్యాలను నిలదీస్తూ వైయస్ఆర్సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంకు పెద్ద ఎత్తున ప్రజాస్పందన లభించింది. దీనిని ఓర్చుకలేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నేడు అమరావతిపై కించపరిచే వ్యాఖ్యలు చేశారనే వివాదాన్ని సృష్టించారు.
వైయస్ఆర్సీపీ హయాంలో ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫేస్టోను ఏడాదిలోనే తొంబైశాతం అమలు చేశాం. మహిళల పక్షపాతిగా వైయస్ జగన్ అనేక పథకాలను అమలు చేశారు. మహిళా ఆర్థిక స్వావలంభనకు అండగా నిలిచారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలను ముందంజలో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మహిళ రక్షణ కోసం దిశాయాప్, దిశా పోలీస్ స్టేషన్లను తీసుకువచ్చారు. మహిళల పట్ల అంతటి గౌరవం ఉన్న నాయకుడు వైయస్ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని రజిని అన్నారు.
