
ప్రతీ దరఖాస్తు నమోదు చేయాలి
● కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
కాటారం: రెవెన్యూ సదస్సులో భాగంగా భూ సమస్యలపై రైతులు, భూ యజమానులు అందిస్తున్న ప్రతి దరఖాస్తును మొదటగా రిజిస్టర్లో నమోదు చేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్సింగ్ రెవెన్యూ అధికారులకు సూచించారు. భూభారతిలో భాగంగా కాటారం మండలం బొప్పారం, దామెరకుంట గ్రామాల్లో బుధవారం రెవెన్యూ సదస్సులు కొనసాగగా సబ్ కలెక్టర్ పరిశీలించారు. దరఖాస్తుల సేకరణ ప్రక్రియ, దరఖాస్తుల వివరాలను తహసీల్దార్ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల నమోదు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ప్రతి దరఖాస్తును ఆఫ్లైన్లో రిజిస్టర్లో నమోదు చేసి తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేయాలని ఆదేశించారు. దరఖాస్తుదారుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను వినాలని తెలిపారు. రెండో రోజు బొప్పారంలో 116, దామెరకుంట 249 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ సదస్సుల్లో నయాబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్ఐ వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.
భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం
మల్హర్: భూ సమస్యలపై భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని కాటారం సబ్ కలెక్టర్ మ యాంక్ సింగ్ అన్నారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లారం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామసభను బుధవారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ సందర్శించారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి సదస్సులు దోహదపడుతాయని పేర్కొన్నారు.
282 దరఖాస్తులు..
మండలంలోని మల్లారం, కాపురం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ గ్రామసభలో వివిధ భూ సమస్యలపై రైతుల నుంచి 282 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ రవికుమార్ తెలిపారు. మల్లారంలో 72, కాపురంలో 282 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎస్ఓ శివ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.