
‘సీకేఎం’ వైద్యుల నిర్లక్ష్యం
ఎంజీఎం: వరంగల్ సీకేఎం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత ప్రాణం మీదికి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం వరంగల్ కాశికుంట ప్రాంతానికి చెందిన నజియా భాను ప్రసూతి సేవల కోసం సీకేఎంలో ఈనెల 25న రాత్రి చేరారు. రాత్రి సుమారు నాలుగు గంటలు శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు బాబు జన్మించినట్లు తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆరు రోజులు బాలింతను కుటుంబ సభ్యులకు చూపించకుండా వైద్య సేవలు కొనసాగుతున్నట్లు చెబుతూ వచ్చారు. శుక్రవారం ఉదయం నజియా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఎంజీఎంకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ కేస్ షీట్ అందించాలని కోరారు. కేస్ షీట్ పోయిందని, కొత్తది రాసిస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. నజియా బేగంను వెంటనే చూపించాలని పట్టుబట్టారు. అప్పటికే నజియా బేగం పొట్ట భాగం విపరీతంగా ఉబ్బి ఉండడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి భవనం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపారు.