వైభవంగా పుష్కరాల నిర్వహణ
● కలెక్టర్ రాహుల్శర్మ
కాళేశ్వరం: కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా సరస్వతినది పుష్కరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. కాళేశ్వరంలో పుష్కర పనులను సోమవారం ఎస్పీ కిరణ్ఖరేతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో ఏకై క త్రివేణి సంగమమని, దేశంలో రెండో ప్రాంతం అయిన కాళేశ్వర క్షేత్రం అద్భుతమైన ఘట్టానికి వేదిక కాబోతుందన్నారు. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే త్రివేణి సంగమంలో ఈ నెల 15న అట్టహాసంగా ప్రారంభం కానున్న సరస్వతి నది పుష్కరాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలించారు. ప్రతిరోజు కాశీ పీఠాధిపతిపతులతో నది హారతి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతి రోజు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 15న సీఎం సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించడంతో పాటు గోదావరి హరతి, త్రిలింగ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ సరస్వతి పుష్కరాలకు అత్యంత అరుదైన చరిత్ర ఉందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని, అధికారులు కాళేశ్వరంలో ఉండి కేటాయించిన విధుల్లో నిమగ్నం కావాలని తెలిపారు. 15న సీఎం పర్యటనను పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కాళేశ్వరం ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు. పుష్కరాల్లో భక్తులకు సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు చేశామన్నారు. ఎస్పీ కిరణ్ ఖరే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారివెంట అడిషనల్ ఎస్పీ కిషన్, సీఐ రామచందర్రావు ఉన్నారు.
వైభవంగా పుష్కరాల నిర్వహణ


