జనగామ: పట్టణంలో ఏన్నో దశాబ్దాల చరిత్రను మోసుకొస్తున్న పాత పురపాలక భవనం రోజు రోజుకూ శిథిలావస్థకు చేరుకుంటోంది. పురపాలక క్యాంపస్లో కొత్త భవనని ర్మాణం పూర్తయ్యాక మొదటగా కలెక్టరేట్కు కేటాయించారు. అనంతరం సూర్యాపేట రోడ్డులో సమీకృత నూతన కలెక్టరేట్ నిర్మాణం పూర్తవడంతో అక్కడికి కార్యాలయాలు మారాయి. తర్వాత పురపాలిక కూడా పాత భవనం నుంచి కొత్త కార్యాలయానికి మారిపోవడంతో ఈ భవనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తగిన సంరక్షణ లేకపోవడంతో గోడలు, పైకప్పులు దెబ్బ తింటూ కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితికి చేరుకుంటుంది. చిన్నపాటి మరమ్మతులు చేసి ప్రభుత్వ శాఖలు లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగంలోకి తెస్తే ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ, భవన పరిరక్షణ బాధ్యత తీసుకునే అధికారులు లేకపోవడంతో భవనం మరింత దెబ్బతింటోంది. ప్రస్తుతం ఈ స్థితిలో వదిలేస్తే భవిష్యత్లో పూర్తిగా పనికిరాని స్థితికి చేరుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. వెంటనే అధికారులు స్పందించి పాత పురపాలక భవనానికి అవసరమైన మరమ్మతులు చేసి, కొత్త హంగులతో వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రజల విన్నపం


