జనగామ రూరల్: ధాన్యం తరలింపు సమస్యలపై నిరసన వ్యక్తం చేస్తూ మండలంలోని పెంబర్తి గ్రామ రైతులు శుక్రవారం వరంగల్– హైదరాబాద్ నేషనల్ హైవే 163పై శుక్రవారం ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో సుమారు 1,200 బస్తాలు కాంటావేసినవి ఉన్నాయని, చీటకోడూర్ రోడ్డులో గల వీరభద్ర రైస్ మిల్లుకు కేటాయించగా అక్కడ అన్లోడ్ ఆలస్యం అవుతోందని వాపోయారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు రాక ధాన్యం లిఫ్టింగ్ చేయడం లేదని ఆవేదన చెందారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించారు. ధాన్యం రవాణాకు లారీలను పంపిస్తామని కొనుగోలు చేసిన బస్తాలను మిల్లులకు తరలించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో గ్రామ రైతులు నిడిగొండ ప్రశాంత్, గోయ భాస్కర్, ఆవుల అంజిరెడ్డి, బోయ సంపత్, బుడిగే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంటా అయినా తరలించడం లేదని
రాస్తారోకో


