నిలిచిన మక్కల కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

నిలిచిన మక్కల కొనుగోళ్లు

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: డివిజన్‌ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రంలో బుధవారం మక్కల కొనుగోళ్లు నిలిపివేశారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున మక్కలు వస్తుండడం, తేమ ఫంగస్‌ పేరుతో మార్క్‌ఫెడ్‌ నిర్వాహకులు పలువురు రైతుల మక్కలను నిరాకరించడం, రైతులు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసనలు, ఆందోళనలు చేస్తుండగా ఏమి చేయలేక సెంటర్‌ నిర్వాహకులు చేతులెత్తేశారు. మంగళవారం ప్రతిపక్షపార్టీల నాయకులు, రైతులు ధర్నాలు చేయడంతో నిబంధనల మేరకే కొనుగోళ్లు చేస్తామని, గొడవలతో ఇబ్బందులకు గురిచేస్తే ఏమి చేయలేమంటూ నిర్వాహకులు కొనుగోళ్లను బంద్‌చేశారు. దీంతో చేసేదేమి లేక సెంటర్‌కు మక్కలు తెచ్చిన పలువురు రైతులు స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆశ్రయించారు. తాము మక్కలు తెచ్చి నాలుగైదు రోజులైందని తేమ, ఫంగస్‌ అంటూ ఇబ్బందులు పెడుతున్నారని, ఈరోజు మొత్తమే కొనుగోళ్లు బంద్‌ చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వెంటనే మార్క్‌ఫెడ్‌ డీఎం రంజిత్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. రైతుల పక్షపాతిగా ఘన్‌పూర్‌లో మార్క్‌ఫెడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, మక్కల కొనుగోళ్లు చేపట్టాలని, ఏమైనా సమస్యలుంటే పోలీసు బందోబస్తుతో కొనుగోలు చేయాలని ఆయన్ను ఆదేశించారు.

రైతులు సంయమనం పాటించాలి

రైతులు ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడవద్దని, సంయమనం పాటించాలని ఎమ్మెల్యే కడియం సూచించారు. జిల్లా కేంద్రంలో సైతం సెంటర్‌ లేదని, సీఎంతో మాట్లాడి నియోజకవర్గ రైతుల కోసం ఇక్కడ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఒకటే సెంటర్‌ ఉండడంతో మక్కలు విపరీతంగా వస్తున్నాయని, దాంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో పాటు జఫర్‌గఢ్‌, ధర్మసాగర్‌, వేలేరు, కంచనపల్లి, కుందారం తదితర ప్రాంతాల్లోనూ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, రైతులు గమనించి సహకరించాలన్నారు. కాగా ఎమ్మెల్యే ఆదేశాలతో మధ్యాహ్నం తర్వాత సెంటర్‌లో కొనుగోళ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేశ్‌, రైతులు అశోక్‌, ఎల్లయ్య, సోమయ్య, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కడియంను ఆశ్రయించిన రైతులు

ఎమ్మెల్యే ఆదేశాలతో మార్క్‌ఫెడ్‌ సెంటర్‌లో కొనుగోళ్లు పునఃప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement