జనగామ: మహిళా సాధికారతకు, చేనేత రంగానికి నూతన ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో, జెన్పాక్ట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) మద్దతుతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జి–సఖీ ఇక్కత్ వీవర్స్ ప్రాజెక్ట్ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రాంతీయ మహిళలకు కొన్ని నెలలుగా ప్రీ–లూమ్, లూమ్ విభాగాలలో నైపుణ్య శిక్షణ అందించగా, ఇప్పటి వరకు 70 మంది మహిళలు శిక్షణ పూర్తి చేశారు. అదనంగా, 30 మంది మహిళలకు ఆధునిక మోదా పెడల్ లిఫ్టింగ్ యంత్రాలను పంపిణీ చేశారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో పల్లె సృజన ఫౌండర్ బ్రిగేడియర్ గణేశం మాట్లాడుతూ.. చిన్న ఆలోచనకు సరైన మద్దతు లభిస్తే ప్రజలకు అవసరపడే సేవాత్మక ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటుందో జి–సఖీ కార్యక్రమం నిరూపించిందన్నారు. ప్రఖ్యాత చేనేత నిపుణుడు చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా మహిళలకు లభిస్తున్న ప్రయోజనాలు జీవితంలో అవసరపడుతాయన్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మోదా యంత్రం రూపకర్త శివకుమార్, జనగామ చేనేత, జౌళీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చౌడేశ్వరి, జెన్పాక్ట్ లీడర్షిప్ టీమ్ సభ్యులు లతీష్, అపర్ణ పాథక్, అజిత్ చౌహాన్, రాధాకృష్ణ, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


