జనగామ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజిర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకుని, తన చిత్త శుద్ధిని నిరూపించుకుంటోందని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పీవీ శ్రీనివాస్తో కలిసి సోమవారం కొమ్మూరి విలేకరులతో మాట్లాడారు.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, గవర్నర్కు పంపడం జరిగిందన్నారు. బీసీలకు ఘోరమైన అవమానం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నిగ్గుతేల్చేందుకు సీబీఐకి అప్పగించడం స్వాగతిస్తున్నామన్నారు. సమావేశంలో లింగాల నర్సిరెడ్డి, వంగాల మల్లారెడ్డి, ఆలేటి సిద్ధిరాములు, చెంచారపు బుచ్చిరెడ్డి, వంగాల కళ్యాణి, ఇందిర, కరుణాకర్రెడ్డి, గాదెపాక రాంచందర్, అల్వాల ఎల్లయ్య, మల్లేశం, బక్క శ్రీని వాస్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు అండగా జీవిత బీమా
జనగామ: అన్ని వర్గాల ప్రజలకు ఆర్థికంగా అండగా జీవిత బీమా సేవలు కొనసాగుతున్నాయని జీవిత బీమా(ఎల్ఐసీ) బ్రాంచి సీనియర్ మేనేజర్ హరిలాల్ అన్నారు. సోమవారం పట్టణంలో భారతీయ జీవిత బీమా సంస్థ జనగామ శాఖ ఆధ్వర్యంలో 69 ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు..30 కోట్ల మంది పాలసీదారులను కలిగి అత్యుత్తమమైన సేవలతో జీవిత బీమా సంస్థ అగ్రగామిగా ఉందన్నారు. జనగామ శాఖ పరిధిలో స్టేషన్ ఘన్పూర్లో శాటిలైట్ ఆఫీస్ ఉందని, త్వరలో పాలకుర్తిలో మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి సిఫార్సు చేశామన్నారు. కార్యక్రమంలో జనగామ ఐడీబీఐ బ్రాంచ్ మేనేజర్ రాజేశ్, బ్యాంక్ మేనేజర్లు, అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కళా ఉత్సవం పోటీలకు ఎంపిక
జనగామ రూరల్: రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీలకు తెలంగాణ మోడల్ స్కూల్ చౌడారం విద్యార్థిని నాంపల్లి అక్షయ ఎంపికై ందని పాఠశాల ప్రిన్సిపాల్ కె.సుధీర్రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలో జరిగిన జిల్లాస్థాయి కళాఉత్సవ పోటీల్లో సోలో క్లాసికల్ డ్యాన్స్లో పదో తరగతి విద్యార్థిని అక్షయ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను అభినందించారు.
భాగవతాన్ని అధ్యయనం చేయాలి
● సాహితీవేత్త శంకరమంచి శ్యాంప్రసాద్
పాలకుర్తి టౌన్: విద్యార్థులు సాంకేతికంగానే కాకుండా సామాజిక విలువల్ని పెంపొందించుకోవటానికి భాగవత పద్యాలను నేర్చుకోవాలని సాహితీవేత్త శంకరమంచి శ్యాం ప్రసాద్ సూచించారు. సోమవారం మండలంలోని బమ్మెర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శంకరమంచి మాట్లాడుతూ.. భక్తితో పాటు సామాజిక విలువల్ని మానవీయ మూలాలను ప్రబోధించిన పోతన భాగవతాన్ని విద్యార్థుల అధ్యయనం చేయాలన్నారు. పోతన పద్యాలను నేర్చుకున్న విద్యార్థులకు పురస్కారాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో చరిత్ర పరిశోధకులు కేవీజీకే ఆచార్యులు శంకరమంచి శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.