
‘స్వచ్ఛ జనగామ’గా తీర్చిదిద్దుకుందాం
జనగామ: పట్టణాన్ని ‘స్వచ్ఛ జనగామ’గా తీర్చిదిద్దుకుందాం.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదనపు సంచాలకులు జ్యోత్స్న అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పురపాలికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘100 రోజుల కార్యాచరణ’లో భాగంగా శుక్రవారం ఆమె జనగామలో పర్యటించారు. కమిషన్ వెంకటేశ్వర్లుతో కలిసి పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, తడి, పొడిచెత్త సేకరణ, దోమల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అపరి శుభ్ర వాతావరణంతో పందులు, కుక్కల సంచారం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నార ని, ప్రతీ కుటుంబం ఇంటి మాదిరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంటి ఎదుట మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. పట్టణంలో పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా మున్సిపల్, మెప్మా విభాగాలు కలిసి పనిచేయాలని, వందరోజుల్లో ఈ మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వి.గోపయ్య, పులి శేఖర్, మెప్మా సిబ్బంది వాణిశ్రీ, తిరుమల, షాహిన్ తదితరులు పాల్గొన్నారు.
100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అదనపు సంచాలకులు జ్యోత్స్న