తరగతి గదిలోనే చదువు, పడక ప్రతి శుక్రవారం అధికారుల తనిఖీ అయినా మారని గురుకులం పరిస్థితి అల్లీపూర్లోని మహాత్మజ్యోతిబా పూలే పాఠశాల దుస్థితి
మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో ఏళ్ల తరబడిగా సమస్యలు తాండవిస్తున్నాయి.
ప్రతి శుక్రవారం జిల్లా అధికారులు గురుకులాన్ని సందర్శిస్తున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదు.
పాఠశాలకు సింగరావుపేట గ్రామంలో రెండెకరాల భూమి కేటాయించినప్పటికీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు.
దీంతో ఈ గురుకులంలోనే విద్యార్థులు సమస్యల మధ్య చదువుకుంటున్నారు.
విద్యార్థులకు వసతి గృహం, డైనింగ్హాల్ లేక చెట్ల కిందనే భోజనం, అల్పాహారం చేస్తున్నారు.
వర్షం కురిస్తే నీరు గదుల్లోకి చేరుతోంది. రాత్రి సమయంలో వర్షం వస్తే జాగారం చేయాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు అంటున్నారు.
కనీసం పాఠశాలలో బెంచీలు కూడా లేక నేలపైనే కూర్చుని పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది.
కిచెన్ రూమ్ పాత ఎస్సారెస్పీ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉండటంతో సరిగా వెలుతురు లేకపోవడంతో వంటలు చేయలేకపోతున్నారు.
మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి.
ఎంపీ ధర్మపురి అర్వింద్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్పందించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రాయికల్: నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా పూలే గురుకులంలో సమస్యలు తాండవిస్తున్నాయి. రాయికల్ మండలం అల్లీపూర్లోని పాఠశాలలో 5 నుంచి 10వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో 335 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే పిల్లలందరూ ఒకే రూమ్లో చదువుకోవడం.. అదే రూమ్లో పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉన్నా.. 11 గదులు మాత్రమే ఉన్నాయి. ఎవరైనా జ్వరం బారిన పడినా.. వారికి వేరే గది సౌకర్యం లేక అదే గదిలో ఓ మూలన పడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
సమస్యల తాండవం


