జగిత్యాలరూరల్/జగిత్యాల టౌన్: కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్దేనన్నారు. సారంగాపూర్ మండలం మ్యాడారంతండా, ధర్మనాయక్తండాల్లో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి పాల్గొన్నారు. తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు ఇవ్వలేదని పేర్కొన్నారు. యూరియా, విద్యుత్ కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూళ్లను రద్దు చేసి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. సర్పంచులు భారతి, సంతోష్, ఆకుల రమేష్, భాస్కర్ నాయక్, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణకు విముక్తి కలిగించిన ఘనత కేసీఆర్దే
ఆంధ్ర నాయకుల కబంధహస్తాల నుండి తెలంగాణకు విముక్తి కలిగించిన ఘనత కేసీఆర్దేనని జీవన్ రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పదవులను త్యాగం చేసి, ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


