గ్రామాల్లో ప్రబలుతున్న వైరల్ జ్వరాలు
రాయికల్ ఆస్పత్రికి ప్రతిరోజూ 300 మందికి తగ్గకుండా ఓపీ
వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యులు
రాయికల్: వాతావరణంలో వచ్చిన మార్పులతో రాయికల్పట్టణంతోపాటు, మండలంలోని 32 గ్రామాల్లో చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నారు. యువత ఒళ్లు నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 250 నుంచి 300 వరకు వైద్య పరీక్షల నిమిత్తం వస్తున్నారు. వీరిలో 120 మందికి సీబీపీ టెస్ట్లు చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతోపాటు, గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో వైరల్ ఫీవర్లు వ్యాపిస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రబలుతున్న జ్వరాలు
మండలంలోని మూటపల్లి, రామాజీపేట, వస్తాపూర్, మైతాపూర్, భూపతిపూర్ తదితర గ్రామాల్లో చిన్నారులు జబులు, జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువత కీళ్ల నొప్పులతో సతమతం అవుతున్నారు. వీరిలో చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండటంతో రాయికల్ ఆస్పత్రిలోని బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. వైరల్ ఫీవర్స్ సోకిన రోగులను ఇన్పేషెంట్స్గా గుర్తించి 2–3 రోజుల పాటు వైద్యసేవలు అందిస్తున్నారు. గ్రామాలు, పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి వైరల్ ఫీవర్స్ రాకుండా చర్యలు చేపట్టాలని పట్టణ, మండల ప్రజలు కోరుతున్నారు.


