జగిత్యాలటౌన్: రాష్ట్రంలో పాలన తిరోగమనంలో సాగుతోందని, సీఎం పాలన చూసి మేఘాలూ ముఖం చాటేశాయని, రైతు గోస పట్టని సీఎం అవసరమా..? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్ అమలు చేయకుండా రైతులను వంచిస్తున్న రేవంత్కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకొచ్చాక సన్నాలకు మాత్రమేనని, ఇప్పుడు కేవలం ఏడు రకాలకేనని చెప్పడం రైతులను వంచించడమేనన్నారు. కేంద్రం అనుమతించిన మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామంటే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా యూరియా యాప్ తెచ్చి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. గతంలో పంటల మార్పిడి అని కేసీఆర్ అంటే రేవంత్రెడ్డి నానా హంగామా చేసిన విషయం మర్చిపోయారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతుబీమా అమలు చేస్తే రేవంత్రెడ్డి ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం సాగుపై ఆంక్షలు సరికావని, రేవంత్కు వ్యవసాయం ఇష్టంలేకుంటే క్రాప్ హాలిడే ప్రకటించి ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రమణ మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోనే రూ పొందించిన జీవన్రెడ్డి వంటి సీనియర్ నాయకులను బయటకు పంపిన రేవంత్ నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. నాలుగు దశాబ్దాలు గా రైతులకు అండగా నిలిచిన జీవన్రెడ్డి ఆ పార్టీని వీడటం కాంగ్రెస్ పనితీరుకు నిదర్శనమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని దావ వసంత విమర్శించారు. నాయకులు గాజుల రాజేందర్, విజయలక్ష్మి, కల్లెపెల్లి దుర్గయ్య, మసర్తి రమేశ్, సురేందర్, మహిపా ల్, అబ్దుల్ భారీ, రాధాకిషన్, నేహాల్ పాల్గొన్నారు.


