జగిత్యాలరూరల్: రైతులపై ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ విధిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కష్టపడి పండించిన రైతుకు ధాన్యం విక్రయించడం పెద్ద సమస్యగా మారిందన్నారు. ఈసారి రైతు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఎప్పుడూ రాలేదన్నారు. ఇది పాలన యంత్రాంగం వైఫల్యమా..? కుట్రపూరితంగా చేస్తున్నారా..? అని అనుమానంగా ఉందన్నారు. ఇప్పటివరకు రెండు లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించామని, ఇంకా మూడు లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని కలెక్టర్ ప్రకటన చూస్తుంటే ఇంకెన్ని రోజులు పడుతుందో అని అనుమానం వ్యక్తం చేశారు. 17 శాతం తేమ ఉన్నప్పుడు కాంటా చేస్తే మిల్లుకు వెళ్లేసరికే 8.9గా వస్తోందని, రైతు ఇప్పటికే క్వింటాల్కు ఐదు కిలోల చొప్పున నష్టపోతుంటే అన్లోడ్ జాప్యంతో మరో 5 కిలోలు నష్టపోతున్నాడని పేర్కొన్నారు. మొత్తంగా క్వింటాల్పై రైతు 10 కిలోలు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ పంటకు రూ.5 వేలు, రెండు పంటలకు రూ.10వేలు ఇస్తే కాంగ్రెస్ రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.10 వేలు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో సికె.రెడ్డి, సత్యంరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, రాంచందర్రెడ్డి, పూర్ణచందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, ఆకుల రమేశ్, రాజిరెడ్డి పాల్గొన్నారు.
కొనుగోళ్లు 50శాతం పూర్తి కాలే..
జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం కూడా ధాన్యాన్ని ప్రభుత్వం కొనలేదని జీవన్రెడ్డి అన్నారు. రేచపల్లి, లచ్చనాయక్తండా, మేడారంతండా, బీమరెడ్డిగూడెంతండాలో పర్యటించారు. లారీలు రావడం లేదని రైతులు జీవన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడారు. లారీలు పంపాలని సూచించారు.


