ఇదేనా ఎన్నికల ‘గౌరవం’
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికలు ముగిసి దాదాపు వారం రోజులు గడిచాయి. కొత్తగా ఎన్నికై న పాలకవర్గాల సంబరాలు ముగిశాయి. ఇదంతా బాగానే ఉంది. సదరు ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు మాత్రం ఇప్పటికీ ఒక్క రూపాయి అందలేదు. ఎన్నికల విధులు నిర్వహించిన వారికి గౌరవ వేతనం అందించడంలో జరుగుతున్న ఆలస్యంపై అడిషనల్ కలెక్టర్కు ఉద్యోగులు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేదు.
వారం గడిచినా..
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో వారం రోజుల క్రితం ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల విధుల్లో మున్సిపాలిటీల్లోని మొత్తం 136 వార్డుల్లో సుమారు 300 మంది ఆర్వో, పీఆర్వోలుగా 18 రోజుల పాటు విధులు నిర్వహించారు. వారికి డీఏతో పాటు దాంట్లో మూడో వంతు కలిపి ప్రతీ రోజుకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కోక్కరికి 18 రోజులకు సంబంధించిన సుమారు రూ.12 వేల వరకు గౌరవ వేతనం రావాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తరువాత కౌంటింగ్ కోసం పనిచేసిన ఉద్యోగులకు వెంటనే డబ్బులు చెల్లించిన ఎన్నికల అధికారులు.. పోలింగ్ డ్యూటీల్లో ఉన్న ఆర్వో, పీఆర్వోలకు మాత్రం ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు. తాము పనిచేపే ప్రాంతాలకు దూరంగా వెళ్లి సొంత డబ్బులు వెచ్చించామని, గౌరవ వేతనం చెల్లింపులో తాత్సారం ఏంటని విధులు నిర్వహించిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘పంచాయతీ’.. తీరుతో
గడిచిన పంచాయతీ ఎన్నికల్లో సుమారు 15 రోజుల పాటు విధులు నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి గౌరవ వేతనం చెల్లింపులో కోతలు పడ్డట్టు సమాచారం.ఆ ఎన్నికల్లో స్టేజ్–1 , స్టేజ్–2లో పనిచేసిన ఆర్వోలు, పీఆర్వోలకు 15 రోజులకు గాను డీఏతో పాటు దాంట్లో మూడింతలు కలిపి గౌరవ వేతనం చెల్లించాల్సి ఉండగా ఆ లెక్కన చెల్లింపులు జరగలేదు. ఆ ఎన్నికల్లో రెండు స్టేజీల్లో పనిచేసిన వారికి కేవలం రూ.5,500 మాత్రమే చెల్లించినట్లు సమాచారం. అదే తీరుగా మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారికి గౌరవ వేతనం చెల్లింపులో ఎక్కడ కోత ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గౌరవ వేతనం పూర్తి స్థాయిలో త్వరితగతిన చెల్లించాలని కోరుతున్నారు.


