
ఎప్పుడొస్తావ్!
చేపా చేపా
● తప్పని ‘మీన’మేషాలు! ● చేపపిల్లల పంపిణీపై నీలినీడలు ● అదను దాటితే నష్టమంటున్న మత్య్యకారులు
జగిత్యాల/సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని ప్రాజెక్టులు, చెరువువు, కుంటల్లో ఉచితంగా విడుదల చేసే చేపపిల్లల సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు టెండర్లు పిలిచింది. అయినా, పలుచోట్ల టెండర్లు దాఖలు కాలేదు. మరికొన్నిచోట్ల దాఖలైనా అర్హత లేకుండాపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభంకాగా ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మొదలుకాలేదు. మత్య్యకారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్ల వ్యయంతో చేపపిల్లలను వదులుతోంది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు అక్రమాలతో ఈ పథకం లోపభూయిష్టంగా మారుతోంది. పంపిణీ ఆలస్యంగా చేపట్టడం, చేపప్లిలల పరిమాణం విషయంలో అక్రమాలతో ఎదగక మత్స్యకారులు ఏటా నష్టపోతూనే ఉన్నారు.
ఎదుగుదలపై ప్రభావం
కిలోసైజ్ చేప పెరగాలంటే కనీసం ఐదు నెలల సమయం పడుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరులోగా ప్రాజెక్టులు, చెరువుల్లో చేపపిల్లల విడుదల చేసేవారు. ఈసారి వాటిని సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెలాఖరులోగానైనా వదిలితే వచ్చే.. ఏడాది ఫిబ్రవరి, మార్చిలో చేపలు పట్టుకుని, విక్రయించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరింత ఆలస్యంచేస్తే వాటిఎదుగుదలపై ప్రభావం ఉంటుందని మ్య్సతకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
6.96 కోట్ల చేపపిల్లలు.. 3.133 చెరువులు
ఉమ్మడి జిల్లాలోని సుమారు 56 వేల మంది మత్స్యకారులు చేపలవేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటివరకూ వాటిని విడుదల చేయకపోవడంతో వేట సీజన్ను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఒక్క నారాయణపేటలోనే..
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం చేపపిల్లల పంపిణీ చేపట్టినా.. ఒక్క నారాయణపేట జిల్లా తప్ప రాష్ట్రంలో మరెక్కడా చేపలు విడుదల చేయలేకపోయింది. రెండేళ్లకు సంబంధించి బకాయిలు కాంట్రాక్టర్లకు చెల్లించలేదని, దీంతోనే వారు పంపిణీ చేసేందుకు సిద్ధంగా లేదరని తెలుస్తోంది. ఈఏడాది భారీగా కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియలో నెలకొన్న సందిగ్ధంతో పంపిణీ ప్రక్రియ ఆలస్యం అవుతోంది.
దీపావళి తర్వాత పంపిణీ
పెద్దపల్లి జిల్లాలో చేపల సరఫరా కోసం రెండు బిడ్లు వచ్చాయి. వీరికి అర్హత లేక తిరిస్కరించాం. సమయం లేనందున మరోసారి టెండర్లు ఆహ్వానిస్తాం. ప్రత్యామ్నాయంగా ఇతర జిల్లాల కాంట్రాక్టర్లుతో పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటాం. దీనికి సంబంధించి ఉన్నాతాధికారులు లేఖ రాశాం. దీపావళి తర్వాత పంపిణీ చేస్తాం.
– నరేశ్నాయుడు, మత్య్యశాఖ జిల్లా అధికారి, పెద్దపల్లి
ఉమ్మడి జిల్లాలో చేపపిల్లల పంపిణీ వివరాలు
జిల్లా చెరువులు లక్ష్యం వాటిఖర్చు (లక్షల్లో) (లక్షల్లో)
జగిత్యాల 696 169.33 224.11
కరీంనగర్ 921 220.04 217.98
పెద్దపల్లి 1,076 158.82 158.30
సిరిసిల్ల 440 148.28 175.87
మొత్తం 3,133 696.47 776.26

ఎప్పుడొస్తావ్!